ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతు మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) 170 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/20) నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది.
లియామ్ లివింగ్ స్టోన్(40 బంతుల్లో ఫోర్, 5 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. జితేష్ శర్మ(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 33), టీమ్ డేవిడ్(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 32) మెరుపులు మెరిపించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీయగా.. సాయి కిషోర్(2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీసారు.

దెబ్బతీసిన సిరాజ్..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని గుజరాత్ టైటాన్స్ బౌలర్లు అందిపుచ్చుకున్నారు. సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే ఫిల్ సాల్ట్ ఇచ్చిన సునాయస క్యాచ్ను జోస్ బట్లర్ నేలపాలు చేశాడు. కానీ ఆ మరుసటి ఓవర్లోనే విరాట్ కోహ్లీని(7) అర్షద్ ఖాన్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం సిరాజ్ తన వరుస ఓవర్లలో దేవదత్ పడిక్కల్(4)తో పాటు డేంజరస్ ఫిల్ సాల్ట్(14)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండు లైఫ్లు వచ్చినా ఫిల్ సాల్ట్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దాంతో 35 పరుగులకే ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆదుకున్న లివింగ్, జితేష్..
పవర్ ప్లే అనంతరం రజత్ పటీదార్ను ఇషాంత్ శర్మ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో జితేశ్ శర్మ, లియామ్ లివింగ్ స్టోన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. జితేశ్ శర్మ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 52 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని సాయి కిషోర్ విడదీసాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో జితేశ్ శర్మ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా(5) తీవ్రంగా నిరాశపర్చాడు. సాయికిషోర్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టీమ్ డేవిడ్తో కలిసి లివింగ్ స్టోన్ చెలరేగాడు.
టీమ్ డేవిడ్ మెరుపులు..
ముఖ్యంగా రషీద్ ఖాన్ బౌలింగ్లో విరుచుకుపడ్డాడు. అతని బౌలింగ్లో లివింగ్ స్టోన్ 5 సిక్సర్లు బాదడం విశేషం. ఈ క్రమంలో అతను 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో టీమ్ డేవిడ్ ఉండటంతో.. ఆర్సీబీ 190 పరుగులు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ 19వ ఓవర్ వేసిన సిరాజ్.. లివింగ్ స్టోన్ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఆ ఓవర్లో 4 పరుగులు మాత్రమే వచ్చాయి. ప్రసిధ్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్లో టీమ్ డేవిడ్.. వరుసగా 4, 6, 4 బాది ఆఖరి బంతికి ఔటయ్యాడు. ఈ ఓవర్లో 16 పరుగులే రావడంతో ఆర్సీబీ 169 పరుగులే చేయగలిగింది.