బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్లో కీలక పోరుకు సిద్దమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు వరణుడు గట్టి షాకివ్వనున్నాడు. నేడు(ఆదివారం) సాయంత్రం గుజరాత్ టైటాన్స్తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్లో ఆర్సీబీ అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బెంగళూరులో ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది. దాంతో మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పివేసారు.
చిన్నస్వామి స్టేడియంలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. అదే జరిగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోనుంది. ప్రస్తుతం 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్లో గెలవడం చాలా ముఖ్యం. ఓడితే మాత్రం ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఫలితంపై ఆర్సీబీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

ఆర్సీబీ- గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ వర్షంతో రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తోంది. అదే జరిగితే ఆర్సీబీకి 15 పాయింట్స్ వస్తాయి.
సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడితేనే ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. లేదంటే ఆ జట్టుకు నిరాశ తప్పదు.
టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్ మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ ఖరారు చేసుకుంది. కేకేఆర్పై ఒక్క పరుగు తేడాతో గెలిచిన ఆ జట్టు నాకౌట్ చేరింది.
సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. 11 ఓవర్లు పూర్తయ్యేసరికి సన్రైజర్స్ వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్కు ఆర్సీబీ అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. ముంబైని ఓడించాలని కోరుకుంటున్నారు.
చిన్నస్వామి స్టేడియంలో వర్షానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. వర్షం ఆగినా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారి ఆటకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది.