ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) 188 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసింది. రజత్ పటీదార్(32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది.
కామెరూన్ గ్రీన్(24 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 32 నాటౌట్), విల్ జాక్స్(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 41) రాణించగా.. విరాట్ కోహ్లీ(13 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 27) దూకుడుగా ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రసిక్ సలామ్(2/23), ఖలీల్ అహ్మద్(2/31) రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

లోయరార్డర్ బ్యాటర్లు మహిపాల్ లోమ్రోర్(13), దినేశ్ కార్తీక్, స్వప్నిల్ సింగ్(0) దారుణ వైఫల్యం ఆర్సీబీ కొంపముంచింది. ఈ ముగ్గురి వైఫల్యంతో 17, 18వ ఓవర్లో ఆర్సీబీ 10 పరుగులే చేసింది. దాంతో భారీ లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయింది.
శుభారంభం లేదు..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్(6) మూడో ఓవర్లోనే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్లోనే దూకుడుగా ఆడుతున్న విరాట్ కోహ్లీ(27)ని ఇషాంత్ శర్మ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 36 పరుగులకే ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన విల్ జాక్స్, రజత్ పటీదార్ జట్టును ఆదుకున్నారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. దాంతో పవర్ ప్లేలో ఆర్సీబీ 2 వికెట్లకు 61 పరుగులు చేసింది. అనంతరం రజత్ పటీదార్ భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. ఈ క్రమంలో అతను 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
దెబ్బతీసిన రసిక్ సలామ్..
88 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రసిక్ సలామ్ విడదీసాడు. జోరు మీదున్న రజత్ పటీదార్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్దిసేపటికే హాఫ్ సెంచరీకి చేరువైన విల్ జాక్స్ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన మహిపాల్ లోమ్రోర్తో కలిసి కామెరూన్ గ్రీన్ దూకుడుగా ఆడాడు.
ఓవైపు గ్రీన్ ధాటిగా ఆడుతుండగా.. మరోవైపు మహిపాల్ లోమ్రోర్(13), దినేశ్ కార్తీక్(0), స్వప్నిల్ సింగ్(0) వరుసగా పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో 17, 18వ ఓవర్లో ఆర్సీబీ 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్రీజులోకి వచ్చిన కర్ణ్ శర్మ ఆఖరి ఓవర్లో బౌండరీ బాది రనౌటయ్యాడు. ఆఖరి బంతికి సిరాజ్ కూడా రనౌటవ్వడంతో ఆర్సీబీ 187 పరుగులకే పరిమితమైంది.