లెఫ్టార్మ్ స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ రాకతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆటనే మారి పోయిందని ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. స్వప్నిల్ సింగ్ కారణంగా బౌలింగ్ బలం పెరిగిందని, మిగతా బౌలర్లు కూడా రాణిస్తున్నారని చెప్పాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 47 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది వరుసగా ఐదో విజయం. తొలి 8 మ్యాచ్ల్లో ఒకే ఒక్క విజయం సాధించిన ఆర్సీబీ తర్వాత ఆడిన ఐదు మ్యాచ్లకు ఐదు గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ విజయానంతరం మాట్లాడిన ఫాఫ్ డుప్లెసిస్ జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు.

'ఈ విజయం అద్భుతం. మా ప్రదర్శన చాలా సంతోషాన్నిస్తోంది. ఫస్టాఫ్ సీజన్లో మేం సమష్టిగా రాణించలేకపోయాం. మాకు ఏది కలిసి రాలేదు. బ్యాటింగ్, బౌలింగ్లో తేలిపోయాం. కానీ ఇప్పుడు రెండు విభాగాల్లో సమష్టిగా రాణిస్తున్నాం. కొన్నిసార్లు వ్యక్తులు మ్యాచ్ల విజయాలతో పాటు అన్నింటి గురించి మాట్లాడుతారు.
కానీ స్వప్నిల్ సింగ్ రాకతో మా జట్టు ప్రదర్శనే మారిపోయింది. అతని లెఫ్టార్మ్ స్పిన్ జట్టుకు ఉపయోగపడుతోంది. ఇక ఈ విజయాల వెనుక చాలా కష్టం ఉంది. తెర వెనుక చాలా పని చేశాం. అందుకు తగ్గ ప్రతి ఫలాన్ని పొందుతున్నాం. ప్రస్తుతం మా బౌలింగ్లో వైవిధ్యం ఉంది. గత రెండు, మూడు మ్యాచ్ల్లో యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్ అసాధారణ ప్రదర్శన కనబర్చారు.
మేం ఇదే తరహా ఆటను కొనసాగించాలనుకుంటున్నాం. ఫియర్లెస్ గేమ్తో సమష్టి ప్రదర్శన కనబరుస్తూ విజయాలు అందుకోవాలనుకుంటున్నాం.'అని ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు.
రజత్ పటీదార్ క్లాస్ ఇన్నింగ్స్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. రజత్ పటీదార్(32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. కామెరూన్ గ్రీన్(24 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 32 నాటౌట్), విల్ జాక్స్(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 41) రాణించారు.
విరాట్ కోహ్లీ(13 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 27) ధాటిగా ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రసిక్ సలామ్(2/23), ఖలీల్ అహ్మద్(2/31) రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.
యశ్ దయాల్ తీన్మార్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్(39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. షై హోప్(23 బంతుల్లో 4 ఫోర్లతో 29) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్ 3 వికెట్లు తీయగా.. స్వప్నిల్ సింగ్, మహమ్మద్ సిరాజ్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను వెనక్కి నెట్టి ఐదో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగురుచుకుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం తమ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది.