ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. వరుసగా ఐదో మ్యాచ్లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో ఆర్సీబీ 47 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో రన్రేట్ను కూడా మెరుగుపరుచుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. రజత్ పటీదార్(32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. కామెరూన్ గ్రీన్(24 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 32 నాటౌట్), విల్ జాక్స్(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 41) రాణించారు.

విరాట్ కోహ్లీ(13 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 27) ధాటిగా ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రసిక్ సలామ్(2/23), ఖలీల్ అహ్మద్(2/31) రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.
మలుపు తిప్పిన ఫీల్డింగ్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్(39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. షైహోప్(23 బంతుల్లో 4 ఫోర్లతో 29) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్ 3 వికెట్లు తీయగా.. స్వప్నిల్ సింగ్, మహమ్మద్ సిరాజ్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీసారు.
ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగవ్వగా.. ఢిల్లీ క్యాపిటల్స్ సంక్లిష్టంగా మార్చుకుంది. ఆర్సీబీ సూపర్ ఫీల్డింగే ఈ మ్యాచ్ను మలుపు తిప్పింది. రెండు రనౌట్స్, సంచలన క్యాచ్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసాయి.
శుభారంభం లేదు..
188 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ను స్వప్నిల్ సింగ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. జేక్ ఫ్రెజర్ మెక్గర్క్(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 21) దూకుడుగా బ్యాటింగ్ చేయగా.. క్రీజులోకి వచ్చిన అభిషేక్ పోరెల్(2)ను యశ్ దయాల్ పెవిలియన్ చేర్చాడు.
అదే ఓవర్లో మెక్గర్క్ను యశ్ దయాల్ రనౌట్ చేయడంతో 24 పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన కుమార్ కుశాగ్ర(2) సిరాజ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది.
అక్షర్ పటేల్ ఒంటరి పోరాటం..
ఈ పరిస్థితుల్లో షైహోప్, అక్షర్ పటేల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ధాటిగా ఆడుతూ వేగంగా పరుగులు చేశారు. ఐదో వికెట్కు 56 పరుగులు జోడించిన అనంతరం షైహోప్(29)ను లాకీ ఫెర్గూసన్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే డేంజరస్ ట్రిస్టన్ స్టబ్స్ను కామెరూన్ గ్రీన్ స్టన్నింగ్ త్రో తో రనౌట్ చేశాడు.
మరోవైపు 30 బంతుల్లో అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రసిక్ సలామ్(10) కామెరూన్ గ్రీన్ ఔట్ చేయగా.. అక్షర్ పటేల్ను యశ్ దయాల్ పెవిలియన్ చేర్చాడు. దాంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. ముకేష్ కుమార్(3)ను మహిపాల్ లోమ్రోర్ ఔట్ చేయగా.. కుల్దీప్ యాదవ్(6) యశ్ దయాల్ ఔట్ చేసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.