చెత్త ఫీల్డింగ్తోనే గెలవాల్సిన మ్యాచ్లో ఓటమిపాలయ్యామని ఢిల్లీ క్యాపిటల్స్ తాత్కలిక కెప్టెన్ అక్షర్ పటేల్ అన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో ఆదివారం జరిగిన మ్యాచ్లో 47 పరుగుల భారీ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తయ్యింది.
పదే పదే స్లో ఓవర్ రేట్కు కారణమైన ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ రిషభ్ పంత్పై ఐపీఎల్ నిర్వాహకులు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించిన విషయం తెలిసిందే. దాంతో అక్షర్ పటేల్ తాత్కలిక సారథిగా వ్యవహరించాడు.

ఆ క్యాచ్లు పట్టుంటే..
మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన అక్షర్ పటేల్.. చెత్త ఫీల్డింగ్తో పాటు పేలవ బ్యాటింగ్ కూడా తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోవడం, కీలక ఆటగాళ్లు రనౌట్ అవ్వడం తమ పతనాన్ని శాసించిందన్నాడు.
'క్యాచ్లు నేలపాలు చేయడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. ఆ క్యాచ్లు పట్టుంటే మేం ఆర్సీబీని 150 పరుగుల్లోపే కట్టడి చేసేవాళ్లం. పవర్ ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోయినా.. లక్ష్యాన్ని చేధించడం పెద్ద కష్టమేమి కాదు. అయితే ఈ పిచ్పై 160-170 పరుగులు చేయడమే చాలా ఎక్కువ. పిచ్ చాలా భిన్నంగా ఉంది.
కొన్నిసార్లు బంతి స్కిడ్ అవుతంటే.. మరికొన్నిసార్లు ఆగి వస్తోంది. ప్రధాన ఆటగాళ్లు రనౌట్ అయినా.. పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోయినా.. లక్ష్యాన్ని చేధించే ప్రయత్నం చేస్తే ఫలితాన్ని రాబట్టవచ్చు. కానీ మా ఆటగాళ్లు ఇలా ఆలోచించలేదు.'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
రజత్ పటీదార్ విధ్వంసం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. రజత్ పటీదార్(32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. కామెరూన్ గ్రీన్(24 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 32 నాటౌట్), విల్ జాక్స్(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 41) రాణించారు.
విరాట్ కోహ్లీ(13 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 27) ధాటిగా ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రసిక్ సలామ్(2/23), ఖలీల్ అహ్మద్(2/31) రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.
అక్షర్ పటేల్ పోరాడినా..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్(39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. షై హోప్(23 బంతుల్లో 4 ఫోర్లతో 29) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్ 3 వికెట్లు తీయగా.. స్వప్నిల్ సింగ్, మహమ్మద్ సిరాజ్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను వెనక్కి నెట్టి ఐదో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగురుచుకుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం తమ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది.