
ఆ సింగిల్ ఇవ్వకుంటే...
చివరి ఓవర్లో కోహ్లీసేన విజయానికి 15 పరుగులు అవసరం కాగా... తొలి మూడు బంతులకు 7 పరుగులే లభించాయి. దాంతో బెంగళూరు విజయ సమీకరణం చివరి మూడు బంతుల్లో 8 పరుగులుగా మారింది. స్ట్రయికింగ్ ఎండ్లో ఉన్న భరత్... అవేశ్ ఖాన్ వేసిన నాలుగో బంతికి పరుగులు రాబట్టలేకపోయాడు. ఐదో బంతికి రెండు పరుగులు సాధించడంతో... ఆఖరి బంతికి 6 పరుగులు అవసరమయ్యాయి. అయితే అవేశ్ ఖాన్ వైడ్ వేయడంతో... బెంగళూరు గెలుపు సమీకరణం చివరి బంతికి ఐదు పరుగులుగా మారింది. ఉత్కంఠ తారస్థాయికి చేరిన ఈ సమయంలో ఎటువంటి ఒత్తిడికి లోనుకాని భరత్ ... లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాది జట్టును గెలిపించాడు. అయితే ఐదో బంతికి సింగిలే రావాల్సి ఉండగా.. ఢిల్లీ ఫీల్డర్ అక్షర్ పటేల్ అలసత్వంతో మరో పరుగు అదనంగా లభించింది. ఈ పరుగు తీయకుండా ఉంటే ఢిల్లీ గెలిచేది. లేకుంటే కనీసం సూపర్ ఓవర్కు ఐనా దారితీసేది.

సిక్స్ కొట్టినా టై అయ్యేది.
బంతిని వేగంగా విసరాలనే ఆతృతలో అక్షర్ తప్పిదం చేశాడు. దాంతో భరత్, మ్యాక్సీ మరో పరుగుతీసారు. వాస్తవానికి భరత్ స్ట్రైకింగ్ తీసుకోవడానికి నిరాకరించాడు. కానీ మ్యాక్సీ పిలుపు ఇవ్వడంతో పరుగు పూర్తి చేశాడు. ఒకవేళ ఈ పరుగును కట్టడి చేసుంటే ఢిల్లీ విజయానికి చివరి బంతికి 7 పరుగులు అవసరమయ్యేవి. అప్పుడు సిక్స్ కొట్టినా మ్యాచ్ టై అయ్యేది. స్ట్రైకింగ్లో మ్యాక్స్వెల్ ఉన్నా.. అతను సిక్స్ కొట్టలేకపోయేవాడు. పెద్దమైదానం కావడంతో భారీ షాట్లు ఆడేందుకు మ్యాక్సీ ఇబ్బంది పడ్డాడు. అతను హాఫ్ సెంచరీ బాదినా.. అందులో ఒక్క సిక్స్ లేదంటే భారీ షాట్లు ఆడటంతో మ్యాక్సీ తడబాటును అర్థం చేసుకోవచ్చు. సిక్స్ కొట్టాలనే ఆతృతలో అతను భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యేవాడు. అప్పుడు ఢిల్లీ సులువుగా గెలిచేది. కానీ అక్షర్ చేసిన చిన్న తప్పిదం ఆ జట్టు ఓటమిని శాసించింది. అవేశ్ ఖాన్ సైతం ఎలాంటి ఒత్తిడి లేకుండా చివరి బంతిని వేసేవాడు.

మ్యాచ్ టర్నింగ్ పాయింట్..
ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ఫీల్డింగ్ కూడా బెంగళూరుకు కలిసొచ్చింది. అక్షర్ వేసిన 14వ ఓవర్లో మ్యాక్స్వెల్ ఇచ్చిన రెండు సులభమైన క్యాచ్లను శ్రేయస్ అయ్యర్, అశ్విన్ జారవిడిచారు. ఆ ఓవర్ ఫస్ట్ బాల్నే డీప్ మిడ్ వికెట్మీదుగా మ్యాక్సీ భారీ షాట్ ఆడగా.. ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్ నేలపాలు చేశాడు. గాల్లో ఉన్న బంతిని అంచనా వేయడంలో అతను విఫలమయ్యాడు. ఇక అదే ఓవర్ ఆఖరి బంతికి మ్యాక్సీ స్లాగ్ స్వీప్ షాటే ప్రయత్నం చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచిన బంతిని షార్ట్ థర్డ్ మ్యాన్ ఫీల్డర్.. అశ్విన్ నేలపాలు చేశాడు. ఈ రెండు అవకాశాలతో చెలరేగిన మ్యాక్స్వెల్.. 32 బంతుల్లో అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నాడు. ఇక చివరి ఓవర్లో భరత్తో కలిసి చెలరేగడంతో బెంగళూరుకు విజయం ఖాయమైంది.

భరత్ సూపర్ ఇన్నింగ్స్..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 48), శిఖర్ ధావన్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 43) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(2/25) రెండు వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, డాన్ క్రిస్టియన్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 166 పరుగులు చేసింది. కేఎస్ భరత్ (52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 78 నాటౌట్), మ్యాడ్ మ్యాక్సీ(33 బంతుల్లో 8 ఫోర్లతో 51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ రెండు, అక్షర్ పటేల్ ఓ వికెట్ తీశాడు. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన భరత్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.


Click it and Unblock the Notifications
