బెంగళూరు: 'గాశారం బాలేకపోతే తాడే పామై కరుస్తుంది'అనే సామెత ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాకు సరిగ్గా సరిపోతుంది. అతనిపై విధి పగబట్టిందో లేక తల రాతే అలా ఉందో తెలియదు కానీ వరుసగా విఫలమవుతున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరుగుతున్న మ్యాచ్లో పృథ్వీ షా(0) రనౌట్గా వెనుదిరిగాడు.
డేవిడ్ వార్నర్ అత్యుత్సాహం.. అనూజ్ రావత్ కళ్లు చెదిరే ఫీల్డింగ్తో పృథ్వీ షా మూల్యం చెల్లించుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పరుగుల కోసం పృథ్వీ షాను డేవిడ్ వార్నర్ తొందరపెట్టగా.. లేని పరుగు కోసం క్రీజు ధాటిన పృథ్వీ షా రనౌటై నిరాశగా పెవిలియన్ చేరాడు.

వాస్తవానికి పరుగు తీసేందుకు పృథ్వీ షా సుముఖంగా లేకపోయినా.. అప్పటికే సగం పిచ్ను ధాటిన డేవిడ్ వార్నర్ ఒత్తిడితో పృథ్వీ షా పరుగుకు వచ్చాడు. పైగా గ్యాప్ షాట్గా భావించిన పృథ్వీ కాస్త లేజీగా పరుగెత్తాడు. కానీ సూపర్ డైవ్తో బంతిని అందుకున్న అనూజ్ రావత్ అంతే వేగంతో నేరుగా వికెట్లను కొట్టేసాడు. సింగిల్ వ్యూలో కనిపించే వికెట్లను అనూజ్ రావత్ నేరుగా హిట్ చేయడం కొసమెరుపు.
మహమ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్ ఈ ఘటన చోటు చేసుకోగా.. ఈ రనౌట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ ఓవర్ నాలుగో బంతిని పృథ్వీ షా బ్యాక్ ఫుట్లో కవర్స్ దిశగా ఆడగా.. సూపర్ డైవ్తో బంతిని అందుకున్న అనూజ్ రావత్ అంతేవేగంతో నాన్ స్ట్రైకర్ వికెట్లను కొట్టేసాడు. దాంతో పృథ్వీ షా నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన పృథ్వీ షాను మరో ఇంపాక్ట్ ప్లేయర్ అయిన అనూజ్ రావత్ ఔట్ చేయడం విశేషం. ఇక బ్యాటింగ్ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్గా జట్టులోకి వచ్చిన అనూజ్ రావత్ జిడ్డు బ్యాటింగ్తో జట్టు భారీ స్కోర్ అవకాశాలను దెబ్బతీసాడు. 22 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 15 పరుగులతో అజేయంగా నిలిచిన అనూజ్ రావత్.. ఆర్సీబీ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అయితే ఈ ఒక్క రనౌట్తో విమర్శలను కాస్త ప్రశంసలుగా మార్చుకున్నాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 50) మినహా అంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.