రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే వేదికగా 3000 పరుగులు చేసిన తొలి బ్యాటర్గా అరుదైన ఫీట్ సాధించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.
సీఎస్కే పేసర్ తుషార్ దేశ్పాండే వేసిన మూడో ఓవర్ తొలి బంతిని లాంగ్ లెగ్ దిశగా భారీ సిక్సర్ బాది కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఈ బంతిని తుషార్ దేశ్పాండే బ్యాక్ ఆఫ్ లెంగ్త్లో వేయగా.. కోహ్లీ స్టేడియం పైకప్పు తాకేలా సిక్సర్ బాదాడు. ఈ సిక్సర్తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ 3005 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

ఈ జాబితాలో విరాట్ కోహ్లీ టాప్లో ఉండగా.. రెండో స్థానంలో రోహిత్ శర్మ, మూడో స్థానంలో ఏబీ డివిలియర్స్ కొనసాగుతున్నారు. అయితే ఈ ఇద్దరూ విరాట్ కోహ్లీకి దరిదాపుల్లో కూడా లేరు. వాంఖడే వేదికగా రోహిత్ శర్మ 2295 పరుగులు చేయగా.. ఏబీ డివిలియర్స్ చిన్నస్వామిలో 1960 రన్స్ చేశాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 47), గ్లేన్ మ్యాక్స్వెల్(5 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 16), ఫాఫ్ డుప్లెసిస్(39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 54) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు.
రజత్ పటీదార్(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 41), కామెరూన్ గ్రీన్(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్, తుషారా దేశ్పాండే తలో వికెట్ పడగొట్టారు.
ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే చెన్నై సూపర్ కింగ్స్ను 200 పరుగుల లోపు కట్టడి చేయాలి. సీఎస్కే 201 పరుగులు చేసి ఓడినా.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది.