హైదరాబాద్: క్రికెట్, సినిమాకు విడదీయని బంధం ఉంది. ఇదే ఫార్ములాతో అభిమానులకు ముందుకు వచ్చిన ఐపీఎల్.. 16 సీజన్లుగా అలరిస్తూనే ఉంది. ఐపీఎల్ ఆరంభంలో ప్రతీ ఫ్రాంచైజీకి సినిమా తారాలు ప్రచారకర్తలుగా.. సహ యజమానులుగా వ్యవహరించారు. ఆ తర్వాత కొందరు దూరమైనా.. క్యాష్ రిచ్ లీగ్లో సినీ తారాల సందడి కొనసాగుతూనే ఉంది.
కేకేఆర్ సహ యజమానిగా షారూఖ్ ఖాన్ ప్రత్యక్షంగా మ్యాచ్లకు హాజరవుతూ తమ జట్టుకు మద్దతు తెలుపుతుండగా.. టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ దగ్గుబాటి సన్రైజర్స్ హైదరాబాద్ ప్రతీ మ్యాచ్కు హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే క్రికెటర్లు, సినీతారాల కామన్ ఫ్యాన్స్.. మైదానల్లో చేసే రచ్చ మాములుగా ఉండదు.

తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్కు ముందు ఇదే ఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మహేశ్ బాబును అభిమానించే వీరు.. చిన్నస్వామి స్టేడియం ముందు విరాట్-మహేశ్ బాబు పోస్టర్లతో హల్చల్ చేశారు.
మైదానానికి వెళ్లే ముందు 'జై బాబు.. మహేశ్ బాబు'అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ కాగా.. మహేశ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ టర్న్ అయ్యే అవకాశం ఉండటంతో పాటు డ్యూ కీలక పాత్ర పోషిస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. 180-200 లక్ష్యాన్ని కూడా ఈ పిచ్పై సునాయసంగా చేధించవచ్చన్నాడు.
మైదానం చిన్నగా ఉండటంతో పాటు బంతి బ్యాట్పైకి వస్తుందని, ఇది బ్యాటర్లకు హెల్ప్గా ఉంటుందని చెప్పాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను జట్టుకు తగ్గ వ్యూహాలకు వాడుకుంటామని చెప్పాడు.
ఈ మైదానంలో టాస్ ప్రభావం ఏ మాత్రం ఉండదని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. ఈ పిచ్లో బ్యాటర్లను ఆపడం కష్టమని, డ్యూ కూడా ఉంటుందని చెప్పాడు. జట్టులో తప్పని పరిస్థితుల్లో ఒక మార్పు చేశామని చెప్పిన ధోనీ.. మగలా స్థానంలో పతీరణ వచ్చాడని తెలిపాడు.