ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మరో చిరస్మరణీయ విజయాన్నందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్తో శనివారం బెంగళూరు వేదికగా ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిన ఈ మ్యాచ్లో విజయం ఇరు జట్లను ఊరించింది. యశ్ దయాల్ స్టన్నింగ్ బౌలింగ్తో ఆర్సీబీ ఓటమి నుంచి గట్టెక్కింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది.
2 ఓవర్లలో 54 రన్స్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ(33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 62), జాకోబ్ బెతెల్(33 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 55) హాఫ్ సెంచరీలతో శుభారంభం అందించగా.. రొమారియో షెపర్డ్(14 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 53 నాటౌట్) ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో అదిరిపోయే ముగింపు అందించాడు. అతనికి ధాటికి సీఎస్కే చివరి 2 ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకుంది. సీఎస్కే బౌలర్లలో మతీష పతీరణ(3/36) మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్, సామ్ కరణ్ చెరో వికెట్ పడగొట్టారు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన ఖలీల్ అహ్మద్(0/65) ధారళంగా పరుగులు ఇచ్చుకున్నాడు.

అనంతరం సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులు చేసి గెలుపొందింది. ఆయుష్ మాత్రే(48 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 94) తృటిలో శతకం చేజార్చుకోగా.. రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో లుంగి ఎంగిడి(3/30) మూడు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా, యశ్ దయాల్ చెరో వికెట్ పడగొట్టారు.
మలుపు తిప్పిన లుంగి ఎంగిడి..
214 పరుగుల భారీ లక్ష్యచేధనలో షేక్ రషీద్(14), సామ్ కరన్(5) విఫలమైనా.. ఆయుషే మాత్రే, జడేజా విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. మూడో వికెట్కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఓవైపు ఆయుషే మాత్రే సెంచరీకి చేరువవ్వగా.. మరోవైపు రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ ఇచ్చిన నాలుగు సునాయస క్యాచ్లను ఆర్సీబీ ఆటగాళ్లు వదిలేసారు. దాంతో సీఎస్కే విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ లుంగి ఎంగిడి 17వ ఓవర్లో వరుసగా ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రేవిస్(0)లను పెవిలియన్ చేర్చి మ్యాచ్ను ఆర్సీబీ వైపు మలుపు తిప్పాడు.
అంపైర్ ఘోర తప్పిదం..
ఆయుష్ మాత్రేను క్యాచ్ ఔట్ చేసిన ఎంగిడి.. డెవాల్డ్ బ్రేవిస్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. నిర్ణీత 15 సెకన్లలోపు రివ్యూ కోరకపోవడంతో డెవాల్డ్ బ్రెవిస్ రివ్యూను అంపైర్ అనుమతించలేదు. టైమర్ స్క్రీన్లో కనిపించకపోవడంతో జడేజాతో బ్రెవిస్ టైమ్ వేస్ట్ చేశాడు. కానీ రిప్లేలో బంతి ఐదో స్టంప్ను మిస్సవ్వడం గమనార్హం. అంపైర్ నితిన్ తప్పిదం సీఎస్కే కొంపముంచింది. ఈ ఓవర్లో రెండు వికెట్లు తీసిన ఎంగిడి 8 పరుగులే ఇచ్చాడు. 18వ ఓవర్ వేసిన సుయాశ్ శర్మ 6 పరుగులే ఇవ్వగా.. 19వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ 14 పరుగులే ఇవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
మళ్లీ గెలిపించిన యశ్ దయాల్
ఆఖరి ఓవర్లో సీఎస్కే విజయానికి 15 పరుగులు అవసరమవ్వగా.. యశ్ దయాల్ తొలి మూడు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే ఇచ్చి ధోనీని ఎల్బీగా ఔట్ చేశాడు. నాలుగో బంతిని బీమర్గా వేయడంతో శివమ్ దూబే భారీ సిక్సర్ బాదాడు. ఇది నోబాల్ కావడంతో చివరి మూడు బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. కట్టడిగా బౌలింగ్ చేసిన యశ్ దయాల్ మూడు సింగిల్స్ మాత్రమే ఇచ్చి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. గతేడాది కూడా యశ్ దయాల్ ఇదే తరహా బౌలింగ్తో సీఎస్కేపై సంచలన విజయాన్ని అందించాడు. 8 బంతులాడిన ధోనీ ఒక సిక్స్తో 12 పరుగులే చేయడం సీఎస్కే ఓటమిని శాసించింది. అతను కాస్త దూకుడుగా ఆడి ఉంటే సీఎస్కే గెలిచేది.