రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ను దురుదృష్టం వెంటాడింది. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)తో జరుగుతున్న మ్యాచ్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటిన ఫాఫ్ డుప్లెసిస్(39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 54) వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు.
రజత్ పటీదార్ ఆడిన స్ట్రైట్ డ్రైవ్ బౌలర్ చేతిని తాకుతూ నాన్స్ట్రైకర్ వికెట్లను తాకింది. అప్పటికే అప్రమత్తమైన నాన్ స్ట్రైకర్ ఫాఫ్ డుప్లెసిస్ బ్యాట్ను క్రీజులో పెట్టాడు. కానీ రీప్లేలో బ్యాట్ నేలను తాకలేదని, గాల్లో ఉందని థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. అయితే ఈ నిర్ణయంపై ఫాఫ్ డుప్లెసిస్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు.

వివాదాస్పద రీతిలో..
అభిమానులతో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు సైతం థర్డ్ అంపైర్ నిర్ణయానికి షాకయ్యారు. బ్యాట్ క్రీజులో పెట్టినట్లు స్పష్టంగా కనబడుతున్నా.. గాల్లో ఉందని ఎలా చెబుతాడని అసహనం వ్యక్తం చేశారు. మిచెల్ సాంట్నర్ వేసిన 13వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని రజత్ పటీదార్ స్ట్రైట్గా ఆడగా.. సాంట్నర్ చేతులను తాకిన బంతి నాన్ స్ట్రైకర్ వికెట్లను తాకింది.
దాంతో చెన్నై ఆటగాళ్లు రనౌట్ కోసం అప్పీల్ చేయగా.. అంపైర్ సమీక్ష కోరాడు. థర్డ్ అంపైర్ పలు కోణాల్లో రీప్లేలను పరిశీలించి డుప్లెసిస్ బ్యాట్ గాల్లో ఉన్నట్లు చెప్పాడు. అనంతరం అల్ట్రా ఎడ్జ్ సాయంతో సాంట్నర్ చేతులను బంతి తాకిందా? లేదా? అని చెక్ చేశాడు. స్నీకో మీటర్లో బంతి తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దాంతో థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు.
అంపైర్పై ఫ్యాన్స్ ఫైర్..
ప్రస్తుతం ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు క్లియర్ ఔట్ అంటే మరికొందరు నాటౌట్ అని కామెంట్ చేస్తున్నారు. సీఎస్కే తొండాట అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 47), ఫాఫ్ డుప్లెసిస్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వర్షం అంతరాయంతో పిచ్ టర్నింగ్ ట్రాక్గా మారినా.. అసాధారణ బ్యాటింగ్తో పరుగులు రాబట్టారు. తొలి వికెట్కు 78 పరుగులు జోడించారు. క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్తో కలిసి రజత్ పటీదార్ నిలకడగా ఆడుతున్నారు. దాంతో ఆర్సీబీ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.