ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఈ డూఆర్డై మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఆర్సీబీ బ్యాటింగ్కు దిగింది.
దూకుడుగా తమ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్సీబీ 3 ఓవర్లలోనే 31 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(9 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 19 బ్యాటింగ్), ఫాఫ్ డుప్లెసిస్(9 బంతుల్లో ఫోర్, సిక్స్తో 12 నాటౌట్) జోరు మీద బ్యాటింగ్ చేస్తుండగా.. వరుణుడు ఆటను ఆపేసాడు. భారీగా వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపేసారు. దాంతో గ్రౌండ్స్మెన్ మైదానాన్ని కవర్లతో కప్పేసారు.

కాసేపటికే వర్షం ఆగిపోగా.. గ్రౌండ్స్మెన్ కవర్లు తొలగించి మైదానాన్ని ఆటకు సిద్దం చేస్తున్నారు. క్షణాల్లో మైదానాన్ని ఆరబెట్టే టెక్నాలజీ చిన్నస్వామి స్టేడియంలో ఉంది. అయితే వర్షం అంతరాయం ఆర్సీబీ అభిమానుల్లో ఆందోళనను పెంచుతోంది.
ఎందుకంటే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్లో విజయం సాధించడంతో పాటు మెరుగైన రన్రేట్ సాధించాలి. ప్రస్తుతం సీఎస్కే రన్రేట్ ఆర్సీబీ కంటే మెరుగ్గా ఉంది. ఆ జట్టును అధిగమించాలంటే ఆర్సీబీ.. పూర్తి మ్యాచ్ ఆడి 18 ప్లస్ రన్స్ తేడాతో గెలవాలి. ఓవర్లు తగ్గుతున్నా కొద్దీ రన్రేట్ సమీకరణం మారుతోంది. ఇప్పుడు ఇదే అభిమానులను కలవరపాటుకు గురి చేస్తోంది.
ఈ మ్యాచ్లో ఆర్సీబీకి మద్దతు తెలిపేందుకు ఆ జట్టు మాజీ క్రికెటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ హాజరయ్యాడు. అతనితో పాటు డబ్ల్యూపీఎల్ 2024 ఛాంపియన్స్ ఆర్సీబీ మహిళల టీమ్ కూడా ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చింది.
తుది జట్లు:
ఆర్సీబీ: ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్వెల్, రజత్ పటీదార్, కామెరూన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ సిరాజ్
సీఎస్కే: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, డారిల్ మిచెల్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, సిమర్జీత్ సింగ్, మహీష్ తీక్షణ