బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగింది. చిన్నదైన చిన్నస్వామి స్టేడియంలో చెన్నై బ్యాటర్లు భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. సిక్సర్ల సునామీతో ఆర్సీబీ బౌలర్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వారికి ఏడుపు ఒక్కటే తక్కువైంది.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు భారీ చేసింది. డేవాన్ కాన్వే(45 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 83), శివమ్ దూబే(27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అజింక్యా రహానే(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 37) విలువైన పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో వ్యాన్ పార్నెల్, విజయ్ కుమార్ వైశాక్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్, సిరాజ్, గ్లేన్ మ్యాక్స్వెల్ తలో వికెట్ తీసారు.

సిరాజ్ శుభారంభం అందించినా..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సీఎస్కేకు ఆర్సీబీ ప్రధాన పేసర్ మహమ్మద్ సిరాజ్ గట్టి షాకిచ్చాడు. తన రెండో ఓవర్లోనే సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ను పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి అజింక్యా రహానే రాగా.. డేవాన్ కాన్వే ధాటిగా ఆడాడు. ఈ ఇద్దరూ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడటంతో చెన్నై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది.
దూబే, కాన్వే విధ్వంసం..
పవర్ ప్లే అనంతరం ధాటిగా ఆడుతున్న అజింక్యా రహానే(37)ను హసరంగా క్లీన్ బౌల్డ్ చేయడంతో రెండో వికెట్కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి శివమ్ దూబే రాగా.. కాన్వే 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాక్స్వెల్ బౌలింగ్లో భారీ సిక్సర్తో విధ్వంసం మొదలుపెట్టిన దూబే.. భారీ షాట్లతో బంతిని మైదానం బయటపడేసాడు. ప్రతీ బౌలర్ బౌలింగ్లో సిక్స్ బాదాడు. కాన్వే సైతం అదే జోరు కొనసాగించడంతో చెన్నై స్కోర్ బోర్డు పరుగెత్తింది.
వచ్చినోడు వచ్చినట్టే..
ఇక సూపర్ యార్కర్తో డేవాన్ కాన్వేను ఔట్ చేసిన హర్షల్ పటేల్ మూడో వికెట్కు నమోదైన 80 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. మొయిన్ అలీ బ్యాటింగ్కు రాగా.. పార్నెల్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాది దూబే 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ వెంటనే భారీ షాట్కు ప్రయత్నించి సిరాజ్ సూపర్ క్యాచ్కు వెనుదిరిగాడు. దూబే ఔటైనా.. రాయుడు, మొయిన్ అలీ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డారు. విజయ్ కుమార్ వేసిన 18వ ఓవర్లో 4, 6 బాదిన రాయుడు క్యాచ్ ఔటవ్వగా.. సిరాజ్ 19వ ఓవర్ను కట్టడిగా వేసాడు.
ధోనీ సింగిల్తో..
ఆఖరి ఓవర్లో హర్షల్ పటేల్ రెండు హై నోబాల్స్ వేయడంతో అంపైర్ రూల్స్ ప్రకారం అతన్ని సస్పెండ్ చేశాడు. దాంతో మిగిలిన నాలుగు బంతులను మ్యాక్స్వెల్ వేయగా.. భారీ సిక్సర్ బాదిన జడేజా మరుసటి బంతికి ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన ధోనీ సింగిల్ తీయగా.. చివరి బంతికి కూడా సింగిల్ రావడంతో చెన్నై 226 పరుగులు చేసింది.