బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్లో నిలకడగా రాణిస్తూ సూపర్ ఫామ్లో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని దురదృష్టం వెంటాడింది. చెన్నై సూపర్ కింగ్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(6) దారుణంగా విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే బౌండరీతో జోరు కనబర్చిన విరాట్ కోహ్లీ.. విచిత్రకర రీతిలో ఔటయ్యాడు.
ఆకాశ్ సింగ్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతిని కోహ్లీ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. ఇన్సైడ్ ఎడ్జ్ అయిన బంతి అతన్ని కాళ్లను తాకుతూ వికెట్లను గీరాటేసింది. దాంతో కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీని దురదృష్టం వెంటాడటంతో అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ బిత్తరపోయింది. అలానే చూస్తూ.. తన బాధను ఎక్స్ప్రెస్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు భారీ స్కోర్ చేసింది. డేవాన్ కాన్వే(45 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 83), శివమ్ దూబే(27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అజింక్యా రహానే(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 37) విలువైన పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో వ్యాన్ పార్నెల్, విజయ్ కుమార్ వైశాక్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్, సిరాజ్, గ్లేన్ మ్యాక్స్వెల్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 218 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. గ్లేన్ మ్యాక్స్వెల్(36 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్లతో 76), ఫాఫ్ డుప్లెసిస్(33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 62) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగినా ఫలితం లేకపోయింది.
చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్పాండే మూడు వికెట్లు తీయగా.. మతీష పతీరణ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ సింగ్, మహీష్ తీక్షణ, మొయిన్ అలీ తలో వికెట్ తీసారు.