
షార్జా: ఐపీఎల్ 2021 సెకండాఫ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) పరాజయాల పరంపర కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్తో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ప్లే ఆఫ్ చేరాలంటే లీగ్లో మిగిలిన ఐదు మ్యాచ్ల్లో మూడు గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. మరోవైపు సమష్టి ప్రదర్శనతో అద్భుత విజయాన్నందుకున్న ధోనీ సేన పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచి ప్లే ఆఫ్ బెర్త్కు అడుగు దూరంలో నిలిచింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(41 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్తో 53), దేవదత్ పడిక్కల్(50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్(11), టీమ్ డేవిడ్(1), మ్యాక్స్వెల్(9) దారుణంగా విఫలమయ్యారు.
చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో మూడు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్కు ఓ వికెట్ దక్కింది. మరోసారి వికెట్ల వెనుకాల మహేంద్రుడు తన మాయాజాలంతో ఆర్సీబీని తక్కువ స్కోర్కే పరిమితం చేశాడు. అనంతరం చేజింగ్కు దిగిన చెన్నై 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 157 రన్స్ చేసి సునాయస విజయాన్నందుకుంది. రుతురాజ్ గైక్వాడ్(26 బంతుల్లో 38), ఫాఫ్ డుప్లెసిస్(26 బంతుల్లో 31), అంబటి రాయుడు(22 బంతుల్లో 32) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. చాహల్, మ్యాక్స్వెల్ ఓ వికెట్ తీశారు.
157 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(26 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్తో 38), ఫాప్ డుప్లెసిస్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 31) మంచి శుభారంభం అందించారు. 71 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని విరాట్ కోహ్లీ సూపర్ క్యాచ్ సాయంతో యుజ్వేంద్ర చాహల్ విడదీసాడు. చాహల్ వేసిన 9వ ఓవర్లో బౌండరీతో జోరు కనబర్చిన రుతురాజ్.. చాహల్ వేసిన ఆ మరుసటి బంతి క్యాచ్ ఔటయ్యాడు. చహల్ వేసిన ఫ్లైట్ అండ్ టర్న్ బాల్ను రుతురాజ్ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేయగా ఎడ్జ్ అయిన బంతి గాల్లోకి లేసింది. ఇక బ్యాక్ వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ కళ్లు చెదిరే ఫార్వర్డ్ డైవ్తో అద్భుతంగా అందుకున్నాడు. గ్లేన్ మ్యాక్స్వెల్ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే ఫాప్ డుప్లెసిస్ కూడా ఔటయ్యాడు.
క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు, మొయిన్ అలీ భారీ షాట్లతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడటంతో చెన్నై లక్ష్యం కరిగిపోయింది. మొయిన్ అలీ, రాయుడు ఔటైనా.. సురేశ్ రైనా, ధోనీ మ్యాచ్ను తమదైన శైలిలో ముగించారు.