ఐపీఎల్ 2025 సీజన్ విజయం నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చేపట్టిన విక్టరీ పరేడ్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ విక్టరీ పరేడ్కు అభిమానుల భారీ సంఖ్యలో హాజరయ్యారు. వారిని అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. మరో 25 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. చిన్నస్వామి స్టేడియంలోకి అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో పోలీసులు వారిని కట్టడి చేయలేకపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
తొలుత ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని ఆర్సీబీ విక్టరీ పరేడ్కు పోలీసులు అనమతి ఇవ్వలేదు. కానీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పట్టుబట్టడంతో అనుమతి ఇచ్చారు. దాంతో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్ నిర్వహిస్తామని ఆర్సీబీ ప్రకటించింది. అభిమానులు నిబంధనలు పాటిస్తూ ఇందులో పాల్గొనాలని ఆర్సీబీ ట్వీట్ చేసింది. ఫ్రీ పాసుల కోసం వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.

విధాన సౌధలో ఆర్సీబీ ఆటగాళ్లను కర్ణాటక సీఎం సిద్దరామయ్య, గవర్నర్ సత్కరించారు. ముందుగా ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ టైటిల్ను అభిమానులకు చూపించగా.. ఆటగాళ్లంతా విధాన సౌధ వద్ద ఏర్పాటు చేసిన స్టేజీపైకి చేరుకున్నారు. జాతీయ గీతం తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లను కర్ణాటక సీఎం సత్కరించారు. ఆ తర్వాత బస్సులో ఆర్సీబీ ఆటగాళ్లు చిన్నస్వామి స్టేడియంకు చేరుకున్నారు. చిన్న స్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లను కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సత్కరించింది. స్టేడియంలో సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆర్సీబీ అభిమానులతో చిన్నస్వామి స్టేడియం కిక్కిరిసింది. తొక్కిసలాట నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.