రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయోత్స సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది. ఈ వేడుకల్లో భాగమయ్యేందుకు చిన్నస్వామి స్టేడియానికి వచ్చిన అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందగా.. మరో 50 మంది గాయపడ్డారు. ఈ అనూహ్య ఘటనతో ఆర్సీబీ సంబరం చిన్నబోయింది. దేశంలో ఇలాంటి క్రీడా సంబంధిత విషాదం చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. 45 ఏళ్ల క్రితం(1980 ఆగస్టు 16న) కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో 16 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు.
భారత క్రీడా చరిత్రలోనే ఇది అతి పెద్ద విషాదం. అప్పుడు మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల అభిమానుల మధ్య ఘర్షణ జరిగి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పరస్పరం అభిమానులు రాళ్లు రువ్వుకోవడం, దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు. ఇక 1969తో ఇదే ఈడెన్ గార్డెన్స్ మైదానం బయట మరో విషాదం చోటు చేసుకుంది. భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ టికెట్ల కోసం పెద్ద ఎత్తున అభిమానులు రావడం, పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట జరగడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వందమందికి పైగా గాయపడ్డారు.

మూడేళ్ల క్రితం(2022) హైదరాబాద్లో జింఖాన మైదానంలో భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో ఇద్దరు పోలీసులతో సహా ఏడుగురు గాయపడ్డారు. కానీ ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.