రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అభిమానులకు గుడ్ న్యూస్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్( కేసీఎస్సీఏ) శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
'అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించడానికి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్కు హోం శాఖ, కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలియజేయడానికి మేం సంతోషిస్తున్నాం.'అని కేసీఎస్సీఏ పేర్కొంది. ప్రభుత్వం, సంబంధిత అధికారులు సూచించిన నిర్దిష్ట నిబంధనలు, షరతులకు అనుగుణంగా మ్యాచ్లు నిర్వహిస్తామని తెలిపింది.
ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలవగా.. మరుసటి రోజే బెంళూరులో ఆ ఫ్రాంచైజీ నిర్వహించిన విజయోత్సవ వేడుక విషాదంగా ముగిసిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ టైటిల్ గెలవడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ విజయోత్సవ వేడుకలో భాగమయ్యారు. అభిమానుల రాకను అంచనా వేయడంలో ఫ్రాంచైజీ, పోలీసు అధికారులు విఫలమయ్యారు. దాంతో చిన్న స్వేమి స్టేడియం బయట తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. భారత క్రికెట్ చరిత్రలోనే ఈ ఘటన ఓ మాయని మచ్చగా మారిపోయింది.

ఆర్సీబీ ఫ్రాంచైజీతో పాటు కర్ణాటక ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాన్ మైకెల్ డి కున్హా నేతృత్వంలో జ్యుడిషయల్ కమిషన్ వేసింది. తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపిన కమిషన్.. చిన్న స్వామి స్టేడియం మ్యాచ్ల నిర్వహణకు సురక్షితం కాదని తేల్చింది. దాంతోనే మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్లతో పాటు దేశవాళీ క్రికెట్ మ్యాచ్లను మరో వేదికకు తరలించారు.
ఆర్సీబీ కూడా తమ హోమ్ గ్రౌండ్ను మార్చుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ నిర్ణయంపై కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో తలొగ్గిన కర్ణాటక ప్రభుత్వం.. కొన్ని షరతులతో మ్యాచ్లు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.