రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ రజత్ పటీదార్(141 బంతుల్లో 18 ఫోర్లు, సిక్స్తో 111) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న అనాధికారిక టెస్ట్లో భారత్ ఏ తరఫున బరిలోకి దిగిన రజత్ పటీదార్.. 131 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని సెంచరీతో భారత్ ఏ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్లో 51.1 ఓవర్లలో 233 పరుగులకు కుప్పకూలింది. మానవ్ సుథార్ మూడు వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. తుషార్ దేశ్పాండే, పుల్కిత్ నారంగ్, విద్వత్ కావేరప్ప తలో వికెట్ తీసారు. ఇంగ్లండ్ లయన్స్ బ్యాటర్లలో డాన్ మౌస్లీ(66 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 60) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా ఏ.. అభిమన్యు ఈశ్వరన్(32) వికెట్ కోల్పోయినా.. రజత్ పటీదార్ సూపర్ సెంచరీతో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. రజత్ పటిదార్ ఔటయ్యే సమయానికి భారత్ 45.2 ఓవర్లలో 3 వికెట్లకు 210 పరుగులు చేసింది.
క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(39 బ్యాటింగ్)తో పాటు శ్రీకర్ భరత్(0 బ్యాటింగ్) ఉన్నారు. రజత్ పటీదార్ శతకం సాధించడంపై ఆర్సీబీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్ వరకు రజత్ పటీదార్ ఇదే జోరును కొనసాగించాలని కోరుకుంటున్నారు.
గతేడాది గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి రజత్ పటీదార్ దూరమయ్యాడు. రజత్ పటీదార్ లేకపోవడంతో ఆర్సీబీ మిడిలార్డర్ బలహీనంగా మారింది. ఈ సారి రజత్ పటీదార్ ఇదే జోరును కొనసాగిస్తే ఆర్సీబీ తిరుగుండదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సంక్షిప్త స్కోర్లు:
ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్ 233 ఆలౌట్
భారత్ ఏ తొలి ఇన్నింగ్స్ 210/3