టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వెక్కిరించానని తనను ఇన్స్టాగ్రామ్ వేదికగా బ్లాక్ చేశాడని ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్వెల్ తెలిపాడు. తాజాగా మ్యాక్స్వెల్ తాను రాసిన 'ది షోమ్యాన్'అనే పుస్తకాన్ని రిలీజ్ చేశాడు. అందులో తన క్రికెట్ కెరీర్కు సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు.
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కి కెప్టెన్గా ఉన్నప్పుడు వీరేంద్ర సెహ్వాగ్తో జరిగిన గొడవ నుంచి.. ఆర్సీబీలోకి వచ్చే వరకు జరిగిన అనేక సంఘటనలు గురించి తెలియజేశాడు. ఆర్సీబీలోకి రావడానికి విరాట్ కోహ్లీ ఎంతో మద్దతు ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు. ఆర్సీబీలోకి వచ్చే వరకు తమ మధ్య స్నేహం లేదని, ఓ సంఘటన కారణంగా తనను విరాట్ ఇన్స్టాలో బ్లాక్ చేశాడని కూడా రాసుకొచ్చాడు.

'నేను ఆర్సీబీకి ఎంపికయ్యానని తెలిసినప్పుడు నన్ను జట్టులోకి స్వాగతించిన తొలి వ్యక్తి విరాట్ కోహ్లీ. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే ఆర్సీబీ ట్రైనింగ్ క్యాంప్లో నేను, విరాట్ కోహ్లీ చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. అదే సమయంలో ఇన్స్టాలో అతన్ని అనుసరించడం మొదలుపెట్టాను.
అతను తిరిగి నన్ను ఫాలో అవుతున్నాడా లేదా అనే విషయాన్ని అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అతనికి సంబంధించిన పోస్ట్లేవి సోషల్ మీడియాలో కనిపించట్లేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఈ విషయాన్ని ఒకతని ముందు ప్రస్తావించగా.. విరాట్ బ్లాక్ చేసి ఉంటాడని చెప్పాడు. భారత పర్యటనకు వచ్చినప్పుడు విరాట్ కోహ్లీని ఎగతాళి చేసినందుకే అతను బ్లాక్ చేశాడనే విషయం తర్వాత తెలిసింది.
ఆ తర్వాత విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లి.. నన్ను ఇన్స్టాలో బ్లాక్ చేశావా? అని అడిగా. అందుకు విరాట్ బదులిస్తూ.. టెస్ట్ మ్యాచ్లో నన్ను ఎగతాళి చేసినందుకే బ్లాక్ చేశా అని తెలిపాడు. నేను వెంటనే మంచి పనిచేశావ్.. నేను అలా చేయాల్సింది కాదు అని బదులిచ్చాను. ఆ తర్వాత విరాట్ నన్ను అన్బ్లాక్ చేయగా.. మేమిద్దం మంచి స్నేహితులమయ్యాం.'అని మ్యాక్సీ తన పుస్తకంలో రాసుకొచ్చాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం 2017లో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రాగా.. రాంచీ టెస్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. భుజాన్ని మరో చేత్తో పట్టుకొని మైదానం వీడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఫీల్డింగ్ సందర్భంగా మ్యాక్సీ కూడా భుజ గాయమైందంటూ కోహ్లీని ఎగతాళి చేశాడు.