రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బ్యాటర్ దేవదత్ పడిక్కల్(99 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్లతో 102) సెంచరీతో చెలరేగాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకు ప్రాతినిథ్యం వహిస్తున్న దేవదత్ పడిక్కల్.. బరోడాతో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సెంచరీ సాధించాడు. పడిక్కల్ శతకంతో ఈ మ్యాచ్లో కర్ణాటక 5 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లో 8 వికెట్లకు 281 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ సెంచరీకి తోడుగా అనీష్(64 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. బరోడా బౌలర్లలో రాజ్ లింబాని, అతిత్ షేత్ మూడేసి వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా, మెరివాలా తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం బరోడా 49.5 ఓవర్లలో 276 పరుగులకు కుప్పకూలింది. శెశ్వాత్ రావత్(126 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 104) సెంచరీతో.. అతిత్ షేత్(59 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 56) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. కర్ణాటక బౌలర్లలో వాసుకి కౌశిక్, ప్రసిధ్ కృష్ణ, అభిలాష్ శెట్టి, శ్రేయస్ గోపాల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. సెంచరీతో కర్ణాటక విజయంలో కీలక పాత్ర పోషించిన దేవదత్ పడిక్కల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో దేవదత్ పడిక్కల్ను ఆర్సీబీ అతని కనీస ధర రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ముందుగా పడిక్కల్ను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. వేలం చివర్లో మరోసారి అతని పేరును వేలంలో ఉంచగా ఆర్సీబీ కనీస ధరకు కొనుగోలు చేసింది. ఆర్సీబీతోనే దేవదత్ పడిక్కల్ ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.