వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమైనట్లు తెలుస్తోంది. ఆమె స్థానంల్ ఆర్సీబీ స్నేహ్ రాణాను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆర్సీబీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ టోర్నీ ఆరంభానికి ముందు ఆర్సీబీ షేర్ చేసిన వీడియోలో శ్రేయాంక పాటిల్ కనిపించింది. కానీ గుజరాత్ జెయింట్స్తో జరుగుతున్న ఈ సీజన్ తొలి మ్యాచ్లో ఆమెకు అవకాశం దక్కలేదు. దాంతో శ్రేయాంక పాటిల్ గైర్హాజరీపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా శ్రేయాంక పాటిల్ ఓ పోస్ట్ను షేర్ చేసింది. 'నా గుండె పగిలింది. కానీ నేను మళ్లీ పుంజుకుంటాను'అనే క్యాప్షన్తో ఊయల ఊగుతున్న ఫొటోను పంచుకుంది.

గత సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలవడంలో శ్రేయాంక పాటిల్ కీలక పాత్ర పోషించింది. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్లో 4 వికెట్లతో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది. మహిళల ఆసియా కప్ సమయంలోనూ శ్రేయాంక పాటిల్ వేలి గాయంతో కొన్ని మ్యాచ్లకు దూరమైంది.
యూఏఈ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్లో రీఎంట్రీ ఇచ్చిన శ్రేయాంక పాటిల్.. ఐర్లాండ్, వెస్టిండీస్తో జరిగిన సిరీస్లకు దూరంగా ఉంది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఫిట్నెస్ సాధించడంపై శ్రేయాంక పాటిల్ ఫోకస్ పెట్టింది. శ్రేయాంక పాటిల్ గైర్హాజరీ ఆర్సీబీకి బలహీనతగా మారింది. ప్రస్తుతం ఆర్సీబీ ప్రేమ రావత్, జార్జియ వెర్హమ్, చార్లీ డీన్, కనిక అహుజా స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్గా ఉన్నారని తెలిపారు.