
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ ముంగిట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆర్సీబీ ట్విటర్ హ్యాండిల్ను హ్యాక్ చేసి సంబంధం లేని పోస్ట్లు చేశాడు. టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ను విమర్శిస్తున్నట్లు ఆర్సీబీ ట్విటర్ ఖాతా నుంచి ఓ ట్వీట్ ప్రత్యక్షమయ్యింది. ఇప్పుడా ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. ఆదివారం ఎలాన్ మస్క్ తాను పెంచుకుంటున్న కొత్త కుక్కపిల్లను పరిచయం చేస్తూ చేసిన ట్వీట్కు.. ఆర్సీబీ ఖాతాతో విమర్శిస్తూ కామెంట్ వచ్చింది. "ఫ్లోకి వచ్చేసింది" అంటూ తన కుక్కపిల్ల ఫొటోను మస్క్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
దీనిపై ఆర్సీబీ స్పందిస్తూ.. '2020లో టెస్లా ద్వారా పర్యావరణ పరిరక్షణ పేరుతో దాదాపుగా రూ.11.05 వేల కోట్ల(1.5 బిలియన్ డాలర్లు) సబ్సీడీని పొందిన మస్క్.. ఇప్పుడదే మొత్తాన్ని బిట్కాయిన్పై పెట్టుబడి పెట్టారు'అంటూ ఆర్సీబీ ఖాతా నుంచి కామెంట్ వచ్చింది. అలా చేసిన వెంటనే సోషల్ మీడియాలో ఆ ట్వీట్ వైరల్గా మారింది. దీనిపై స్పందించిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఫ్రాంఛైజీ.. జట్టుకు సంబంధించిన అధికారిక ఖాతా హ్యాక్ అయిందని ఆరోపించింది. వెంటనే దానికి సంబంధించిన కామెంట్నూ తొలగించింది. మస్క్ను ఉద్దేశించి చేసిన కామెంట్ను తాము ఖండిస్తున్నట్లు తెలిపింది. ఆ తర్వాత వెంటనే తమ ఖాతాను ఫ్రాంఛైజీ అధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

ఐపీఎల్ 2021 సీజన్కు మరో 6 రోజుల్లో తెరలేవనుంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలన్నీయూఏఈ గడ్డపై ప్రాక్టీస్ క్యాంప్లు ఏర్పాటు చేసి ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో కొంత మంది ఆటగాళ్లు మలిదశ మ్యాచ్లకు దూరంగా ఉండగా.. వారి స్థానాల్లో ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లను తీసుకున్నాయి. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు సైతం యూఏఈలో అడుగుపెట్టారు. 6 రోజుల క్వారంటైన్ తర్వాత తమ జట్లతో కలవనున్నారు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కూడా టైటిలే లక్ష్యంగా సిద్దమవుతోంది. మలిదశ లీగ్లో కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్)తో అబుదాబి వేదికగా సెప్టెంబర్ 20న జరిగే మ్యాచ్తో తమ వేటను ప్రారంభించనుంది.
ఇక ఫస్టాప్లో దుమ్మురేపిన కోహ్లీసేన..7 మ్యాచ్ల్లో 5 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించిన కోహ్లీసేన.. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది.
ఇక ఆర్సీబీ విజయాల్లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్రౌండర్ గ్లేన్ మ్యాక్స్వెల్ కీలక పాత్ర పోషించాడు. 6 ఇన్నింగ్స్ల్లో రెండు హాఫ్ సెంచరీలతో 223 పరుగులు చేశాడు. ఏబీ డివిలియర్స్ సైతం 6 ఇన్నింగ్స్ల్లో రెండు హాఫ్ సెంచరీలతో 207 రన్స్ చేశాడు. బౌలింగ్ విభాగంలో పేసర్ హర్షల్ పటేల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 7 మ్యాచ్ల్లో 17 వికెట్లతో టోర్నీ హయ్యెస్ట్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. హర్షల్ పటేల్ తర్వాత కైల్ జెమీసన్ 7 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు.