టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అమ్మకానికి వచ్చిన తన ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)లో మైనారిటీ వాటాను అనుష్క శర్మ పేరిట కొనుగోలు చేయాలని భావిస్తున్నాడని సమాచారం.
ఈ డీల్ విలువ సుమారు రూ. 400 కోట్లు ఉంటుందని బిజినెస్ ఎక్స్పర్ట్స్ అంచనా. ఈ వ్యవహారంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకున్నా.. జోరుగా ప్రచారం సాగుతోంది. తన కెరీర్ మొత్తం ఆర్సీబీకే ఆడిన కోహ్లీ.. ఫ్రాంచైజీ పార్ట్నర్గా మారాలనుకుంటున్నాడని తెలుస్తోంది.
ఆర్సీబీ ఫ్రాంచైజీకి ప్రస్తుతం డియాజియో ఇండియా అనే సంస్థ యజమానిగా ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే ఆర్సీబీ ఫ్రాంచైజీని డియాజియో అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఫ్రాంచైజీ విలువ సుమారుగా 2 బిలియన్ల అమెరికా డాలర్లుగా(రూ.17000 కోట్లు) ఉంటుందని అంచనా.
డియాజియో కంపెనీ ప్రధాన వ్యాపారం మద్యం. డియాజియోకు అమెరికా అతిపెద్ద మార్కెట్. అయితే అక్కడ సుంకాలు పెరగడం, వినియోగదారుల తగ్గడంతో ప్రీమియం మద్యం అమ్మకాలపై ప్రభావం పడింది. దాంతో ఆ సంస్థ..ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది.

ఈ క్రమంలోనే ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులను ప్రధాన వ్యాపారంపై పెట్టాలనే యోచనలో డియాజియో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలవడంతో ఫ్రాంచైజీ విలువ రెట్టింపు అయ్యింది. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలో డియాజియో సంస్థ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై డియాజియో సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్గా ఉన్న జేఎస్డబ్ల్యూ-పార్ట్ జిందాల్, అథర్ పూనవల్లా, కన్నడ సినీ పరిశ్రమకు చెందిన హోంబాలే ఫిల్మ్స్ సంస్థతో పాటు మరో రెండు అమెరికన్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అనుష్క శర్మతో పాటు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ 2 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ పేర్కొంది.
అనుష్క శర్మతో పాటు బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కూడా 2 శాతం వాటా (సుమారు రూ. 300 కోట్లు) కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే వ్యాపారవేత్త ఆదర్ పూనావాలా కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
అనుష్క శర్మ మైనారిటీ వాటా కొనుగోలు చేయాలంటే బీసీసీఐ రూల్స్ సవాల్గా మారనున్నాయి. బీసీసీఐ రూల్స్ ప్రకారం ఐపీఎల్ ఆడుతున్న ఆటగాళ్లు ఫ్రాంచైజీల్లో వాటాలను కలిగి ఉండకూడదు. కోహ్లీ ఆర్సీబీ ఐకాన్ కావడంతో అతని సతీమణి అనుష్క శర్మ వాటా కొనుగోలు చేయడం పరోక్ష యాజమాన్యం కిందకు వస్తుంది.
ఈ విషయంలో బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కోహ్లీ కెరీర్ చివరి దశ ఉన్న నేపథ్యంలో అనుష్క పేరిట వాటా కొనుగోలు చేసేందుకు బీసీసీఐ అనుమతివ్వవచ్చు. తన అభిమానుల కోహ్లీ ఆర్సీబీ యజమానిగా మారాలనుకుంటున్నాడని సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతుంది.