బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఫ్రాంచైజీ విచారం వ్యక్తం చేసింది. ఇది ఒక దురదృష్టకర సంఘటనని పేర్కొంది. మీడియా ద్వారానే తాము ఈ విషయం తెలుసుకున్నామని, ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందామని ఓ ప్రకటనను విడుదల చేసింది. ఐపీఎల్ 2025 సీజన్లో విజేతగా నిలిచిన ఆర్సీబీ బుధవారం బెంగళూరు నగరంలో విక్టరీ పరేడ్ నిర్వహించింది.
అయితే ఈ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియానికి లక్షలాదిగా అభిమానులు తరలి రావడంతో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 55 మంది గాయపడ్డారు. బుధవారం బెంగళూరులోని విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఈ విక్టరీ పరేడ్ నిర్వహించారు. తమ అభిమాన జట్టు గెలుపు సంబరాల్లో భాగమయ్యేందుకు అభిమానులు లక్షల్లో తరలి వచ్చారు. దాంతో ఆ ప్రాంతమంతా ఎర్ర సముద్రాన్ని తలిపించింది. విధాన సౌధలో ఆర్సీబీ ఆటగాళ్లను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు గవర్నర్ సత్కరించారు.

అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లు బస్సులో చిన్నస్వామి స్టేడియం వెళ్లారు. అక్కడికి లక్షల్లో అభిమానులు తరలిరాగా.. పాసులు ఉన్నవారినే పోలీసులు అనమతించారు. పాసులు లేని కొంతమంది అభిమానులు.. స్టేడియం గోడలు, గేట్లు ఎక్కి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. స్టేడియం బయట ఇంత పెద్ద ఘటన జరిగినా.. లోపల విజయోత్సవ వేడుకలు నిర్వహించడం గమనార్హం.
ఈ ఘటనపై ఆలస్యంగా స్పందించిన ఆర్సీబీ ఫ్రాంచైజీ.. ఈ తొక్కిసలాటలో మరణించిన వారికి సంతాపం ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసింది. 'చిన్నస్వామి స్టేడియం బయట చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల మేం తీవ్రంగా కలత చెందాము. ఈ మధ్యాహ్నం జట్టు రాకను అంచనా వేస్తూ బెంగళూరు అంతటా అభిమానులు భారీ ఎత్తున గుమిగూడారు. అయితే మీడియా ద్వారా మేం ఈ దురదృష్టకర సంఘటన గురించి తెలుసుకున్నాం. ప్రతీ ఒక్కరి భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం. ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారికి ఆర్సీబీ సంతాపం తెలుపుతోంది. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి.
ప్రాణ నష్టం మమ్మల్ని మరింత కలిచి వేసింది. ఈ సంఘటన గురించి మా దృష్టికి వచ్చిన వెంటనే మా కార్యక్రమాన్ని ఆపేసాం. స్థానిక అధికారుల మార్గదర్శకత్వం, సలహాలను పాటించే ఈ వేడుకలను నిర్వహించాం. అభిమానులంతా సురక్షితంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం.'అని ఆర్సీబీ తమ ప్రకటనలో పేర్కొంది.
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ) కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. 'చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల సందర్భంగా చోటు చేసుకున్న దురదృష్ట ఘటనపై ఆర్సీబీ, కేఎస్సీఏ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. మృతులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది.'అని కేఎస్సీఏ ఓ ప్రకటనను విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల రూపాయలు అందజేస్తామని కేఎస్సీఏ ప్రకటించింది.