హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్ల్లో మూడింటిలో ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. పంజాబ్ కింగ్స్తో గురువారం జరగనున్న మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనుంది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లో చేజేతులా ఓటమిని తెచ్చుకున్న ఆర్సీబీ.. మళ్లీ విజయాల బాట పట్టడంపై ఫోకస్ పెట్టింది.
ఈ క్రమంలోనే టీమ్ బలహీనతలను అధిగమించేందుకు తుది జట్టులో మార్పులు చేసేందుకు సిద్దమైంది. బ్యాటింగ్లో టాప్-3 మినహా మిగతా బ్యాటర్లు విఫలమవుతుండటం.. బౌలింగ్లో సిరాజ్ ఒక్కడే రాణిస్తుండటంతో ఆర్సీబీ విజయాలందుకోలేకపోతుంది. ఈ క్రమంలోనే బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ను పటిష్టం చేయడంపై ఫోకస్ పెట్టింది.

ఐదు మ్యాచ్ల్లో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లపై వేటు వేసేందుకు రెడీ అవుతోంది. బౌలింగ్లో దారుణంగా విఫలమవుతున్న హర్షల్ పటేల్పై వేటు వేసి సిద్దార్థ్ కౌల్ను తుది జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది. అంతేకాకుండా వెటరన్ స్పిన్నర్ కర్ణ్ శర్మను జట్టులోకి తీసుకురావాలనుకుంటోంది. అంచనాలను అందుకోలేకపోయిన వానిందు హసరంగాను కూడా పక్కనపెట్టేందుకు ఆర్సీబీ సిద్దమైంది.
అతని స్థానంలో మైకేల్ బ్రేస్వెల్ను ఆడిస్తే టీమ్ బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుందని భావిస్తోంది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ రాణిస్తుండగా.. యువ బ్యాటర్ మహిపాల్ లోమ్రోర్ దారుణంగా విఫలమవుతున్నాడు. అతని స్థానంలో అనూజ్ రావత్కు అవకాశాలు ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
గ్లేన్ మ్యాక్స్వెల్ కూడా సూపర్ ఫామ్లో ఉండగా.. దినేశ్ కార్తీక్, షెహ్బాజ్ అహ్మద్ విఫలమవుతుండటం జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది. ఈ ఇద్దరూ కూడా రాణిస్తే ఆర్సీబీకి తిరుగుండదు. బౌలింగ్లో సిరాజ్ మినహా అంతా విఫలమయ్యారు. హర్షల్ పటేల్, విజయ్ కుమార్ వైశాఖ్ ధారళంగా పరుగులిచ్చుకున్నారు. వ్యాన్ పార్నెల్ సైతం అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లోనూ విఫలమవుతున్నాడు. అతని స్థానంలో డేవిడ్ విల్లేను ఆడించే ఛాన్స్ ఉంది.
పంజాబ్తో ఆర్సీబీ తుది జట్టు(అంచనా)
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), అనూజ్ రావత్/మహిపాల్ లోమ్రోర్, గ్లేన్ మ్యాక్స్వెల్, షెహ్బాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్(కీపర్), వానిందు హసరంగా/మైకేల్ బ్రేస్వెల్, వ్యాన్ పార్నెల్/డేవిడ్ విల్లే, కర్ణ్ శర్మ/విజయ్ కుమార్ వైశాఖ్, సిద్దార్థ్ కౌల్/ హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్