ఐపీఎల్ 2024 సీజన్ను ఓటమితో ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. సొంత మైదానంలో సోమవారం సాయంత్రం జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. తమ అభిమానుల సమక్షంలో విజయం సాధించాలని ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని ఆర్సీబీ పట్టుదలతో ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన సీజన్ ఓపెనర్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పేలవ బ్యాటింగ్తో పాటు చెత్త బౌలింగ్ ఆ జట్టు పతనాన్ని శాసించింది. ఈ క్రమంలోనే టీమ్కాంబినేషన్లో స్వల్ప మార్పులు చేయడంపై ఆర్సీబీ మేనేజ్మెంట్ ఫోకస్ పెట్టింది. తొలి మ్యాచ్లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ శుభారంభం అందించారు.

బ్యాటింగ్లో మార్పుల్లేవ్..
డుప్లెసిస్ ధాటిగా ఆడగా కోహ్లీ యాంకర్ రోల్ పోషించాడు. వేగం పెంచే క్రమంలో రహానే స్టన్నింగ్ క్యాచ్కు వెనుదిరిగాడు. సొంత మైదానంలోనైనా భారీ ఇన్నింగ్స్ ఆడాలని కోహ్లీ భావిస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో రజత్ పటీదార్, గ్లేన్ మ్యాక్స్వెల్ డకౌటయ్యారు. ఈ ఇద్దరి వైఫల్యం ఆర్సీబీ ఓటమిని శాసించింది.
బౌలింగ్లో పర్వాలేదనిపించిన కామెరూన్ గ్రీన్.. బ్యాటింగ్లో రాణించాల్సి ఉంది. వికెట్ కీపర్ అనూజ్ రావత్, ఇంపాక్ట్ ప్లేయర్ దినేశ్ కార్తీక్ సంచలన బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. స్పిన్నర్లు కర్ణ్ శర్మ, మయాంక్ దగర్ కూడా పర్వాలేదనిపించారు. కానీ పేసర్లు మహమ్మద్ సిరాజ్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్లు దారుణంగా విఫలమయ్యారు.
ఒక బౌలర్పై వేటు..
వీరికి మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఆర్సీబీ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో రూ. 11.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన అల్జారీ జోసెఫ్ స్థానంలో లాకీ ఫెర్గూసన్ లేదా రీస్ టోప్లీని బరిలోకి దించే అవకాశం ఉంది. ఈ ఒక్కటి మినహా జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. యశ్ దయాల్ ఇంపాక్ట్ బౌలర్గా బరిలోకి దిగవచ్చు.
ఆర్సీబీ తుది జట్టు(అంచనా)
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), రజత్ పటీదార్, గ్లేన్ మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, అనూజ్ రావత్(కీపర్), దినేశ్ కార్తీక్, కర్ణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, మయాంక్ దగర్, లాకీ ఫెర్గూసన్/అల్జారీ జోసెఫ్.
ఇంపాక్ట్ ప్లేయర్: సుయాష్ ప్రభుదేశాయ్, ఆకాశ్ దీప్, యష్ దయాల్, వైశాఖ్ విజయ్కుమార్.