ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బెంగళూరు వేదికగా శుక్రవారం జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో ఆర్సీబీ అమీతుమీ తేల్చుకోనుంది. 6 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించిన ఆర్సీబీ మంచి జోష్లో ఉంది. కానీ ఇతర వేదికలపై విజయాలు సాధిస్తున్న ఆర్సీబీ.. సొంత మైదానంలో మాత్రం తేలిపోతుంది. ఇప్పటి వరకు చిన్నస్వామి వేదికగా ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. పంజాబ్ను ఓడించి సొంతగడ్డపై విజయం సాధించాలనే పట్టుదలతో ఆర్సీబీ ఉంది.
మరోవైపు పంజాబ్ కింగ్స్ సైతం 6 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించింది. కేకేఆర్తో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకొని నయా చరిత్రను లిఖించిన పంజాబ్.. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బెంగళూరు వేదికగా జరిగిన గత రెండు మ్యాచ్ల్లో పిచ్ స్లోగా ఉంది. బ్యాటింగ్కు కష్టమైంది. కానీ తాజా మ్యాచ్కు బ్యాటింగ్ పిచ్ను రెడీ చేసే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోనుంది. డ్యూ ప్రభావం నేపథ్యంలో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు దాదాపు 50 శాతం మ్యాచ్ గెలిచనట్లే. అయితే పంజాబ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్వెల్.. ఆర్సీబీపై ఎలా రాణిస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరూ గతంలో ఆర్సీబీకి ఆడారు. మరోవైపు పంజాబ్ మాజీ ప్లేయర్.. ప్రస్తుత ఆర్సీబీ ఆటగాడు లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మలపై కూడా అందరి దృష్టి నెలకొంది.
మార్పుల్లేకుండానే..?
ఆర్సీబీ తమ విన్నింగ్ కాంబినేషన్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఓపెనర్లుగా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. ఈ ఇద్దరూ మరోసారి శుభారంభం అందిస్తే ఆర్సీబీకి తిరుగుండదు. మిడిలార్డర్ దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్, లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ బరిలోకి దిగనున్నారు. ఈ నలుగురు మంచి ఫామ్లోనే ఉన్నారు. కానీ లివింగ్ స్టోన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. ఫినిషర్గా టీమ్ డేవిడ్ సత్తా చాటుతున్నాడు. కృనాల్ పాండ్యా కూడా బ్యాట్ ఝులిపిస్తే ఆర్సీబీకి భారీ స్కోర్ ఖాయం.
బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ కీలకంగా మారాడు. అతనితో పాటు జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. హజెల్ వుడ్ కాస్త కట్టడిగా బౌలింగ్ చేయాలి. స్పిన్నర్లుగా కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ సత్తా చాటుతున్నారు. బెంగళూరు మైదానానికి తగ్గట్లు ఏమైనా వ్యూహాత్మక మార్పులు చేస్తే తప్పా తుది జట్టులో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు.
ఆర్సీబీ తుది జట్టు(అంచనా):
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్, లియామ్ లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్వుడ్, యశ్ దయాల్
ఇంపాక్ట్ ప్లేయర్: సుయాశ్ శర్మ