ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మరో కీలక పోరుకు సిద్దమైంది. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ముల్లాన్పూర్ వేదికగా ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో ఆర్సీబీ అమీతుమీ తేల్చుకోనుంది. బెంగళూరు వేదికగా శుక్రవారమే జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది.
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు తేలిపోయారు. ఈ మ్యాచ్ జరిగిన 48 గంటల వ్యవధిలోనే ఇరు జట్లు రివేంజ్ ఫైట్కు సిద్దమయ్యాయి. ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఆర్సీబీ ఉంది. అంతేకాకుండా ప్రత్యర్థి వేదికలపై తమ జైత్రయాత్రను కొనసాగించాలనుకుంటుంది.

మళ్లీ స్లో వికెట్..?
మరోవైపు ఆర్సీబీని ఓడించిన పంజాబ్ కింగ్స్ మంచి జోష్లో ఉంది. అదే జోరులో మరోసారి ఆ జట్టును ఓడించాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముల్లాన్పూర్ వేదికగా కేకేఆర్తో జరిగిన గత మ్యాచ్లో పంజాబ్ 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. ఆర్సీబీతో మ్యాచ్కు కూడా స్లో వికెట్ సిద్దం చేసే అవకాశాలు ఉన్నాయి.
అదే జరిగితే మరోసారి స్పిన్నర్లు కీలకం కానున్నారు. స్లో వికెట్ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోనుంది. బెంగళూరు వేదికగా ఆర్సీబీ పతనాన్ని శాసించిన యుజ్వేంద్ర చాహల్పై అందరి దృష్టి నెలకొంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 34 సార్లు తలపడగా.. పంజాబ్ 18, ఆర్సీబీ 16 సార్లు గెలుపొందాయి.
ఆ కుర్రాడిపై వేటు..
గత మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన మరోజ్ భాండగేపై వేటు పడనుంది. అతని స్థానంలో దేవదత్ పడిక్కల్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ స్పిన్ పిచ్ అయితే ఎక్స్ట్రా స్పిన్నర్తో బరిలోకి దిగవచ్చు. యువ లెగ్ స్పిన్నర్ మోహిత్ రతీ లేదా స్వప్నిల్ సింగ్కు చోటు దక్కనుంది.
మిగతా కాంబినేషన్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఓపెనర్లుగా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు. గత మ్యాచ్లో ఈ ఇద్దరి వైఫల్యం జట్టు విజయవకాశాలను దెబ్బ తీసింది. పరిస్థితులకు తగ్గట్లు ఆడి శుభారంభం అందిస్తే ఆర్సీబీకి తిరుగుండదు.
టాప్-5 బ్యాటర్లు చెలరేగితేనే..
మిడిలార్డర్లో దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్, లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ మెరుగైన ప్రదర్శన చేయలేదు. గత మ్యాచ్లో రజత్ పటీదార్, టీమ్ డేవిడ్ మినహా ఎవరూ రాణించలేదు. లివింగ్ స్టోన్ వైఫల్యం జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది. ఫినిషర్గా టీమ్ డేవిడ్ సత్తా చాటుతున్నాడు. ప్రతీ మ్యాచ్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. కృనాల్ పాండ్యా వైఫల్యం కొనసాగుతుంది. అతను కూడా బ్యాట్ ఝులిపిస్తే ఆర్సీబీకి భారీ స్కోర్ దక్కుతుంది.
బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్ వుడ్ రఫ్ఫాడిస్తున్నారు. వారికి తోడు యశ్ దయాల్ కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. భువీ, యశ్ దయాల్ కాస్త కట్టడిగా బౌలింగ్ చేయాలి. స్పిన్నర్లుగా కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ గత మ్యాచ్లో తేలిపోయారు. స్లో వికెట్పై అంతగా ప్రభావం చూపలేకపోయారు. ముల్లాన్పూర్ స్పిన్నర్లకు సహకరించనున్న నేపథ్యంలో కృనాల్, సుయాష్ కీలకం కానున్నారు.
ఆర్సీబీ తుది జట్టు(అంచనా):
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్, లియామ్ లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్వుడ్, యశ్ దయాల్
ఇంపాక్ట్ ప్లేయర్: సుయాశ్ శర్మ