ఐపీఎల్ 2025 సీజన్లో రెండు వరుస విజయాల తర్వాత ఊహించని పరాజయం ఎదుర్కొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. వాంఖడే వేదికగా సోమవారం జరగనున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో ఆర్సీబీ అమీతుమీ తేల్చుకోనుంది. సీఎస్కే, కేకేఆర్తో మ్యాచ్ల్లో గెలుపొంది ఘనంగా ఈ సీజన్ను ప్రారంభించిన ఆర్సీబీ.. బెంగళూరు వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో మాత్రం చిత్తుగా ఓడింది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్పై విజయం సాధించి మళ్లీ విజయాల బాట పట్టాలనే పట్టుదలతో ఆర్సీబీ ఉంది.
మరోవైపు ఆడిన 4 మ్యాచ్ల్లో ఒకే ఒక్క విజయం సాధించిన ముంబై ఇండియన్స్.. సొంతగడ్డపై ఎలాగైనా విజయం సాధించాలనే కసితో ఉంది. జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఆ జట్టు బలాన్ని పెంచింది. అయితే అతను ఆర్సీబీతో మ్యాచ్లో బరిలోకి దిగుతాడా? లేదా? అనేది చూడాలి. గాయంతో గత మ్యాచ్కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ.. రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖాముఖి పోరులో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్దే పైచేయిగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 33 మ్యాచ్లు జరగ్గా.. ముంబై 19, ఆర్సీబీ 14 విజయాలు సాధించాయి. గతేడాది ఇరు జట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్ జరగ్గా ముంబై గెలుపొందింది.

టీమ్ కాంబినేషన్లో మార్పు..
రెండు వరుస విజయాల తర్వాత ఎదురైన పరాజయంతో ఆర్సీబీ తమ బలహీనతలపై ఫోకస్ పెట్టింది. తొలి రెండు మ్యాచ్ల్లో చెలరేగిన ఆర్సీబీ బ్యాటింగ్ విభాగం.. గుజరాత్ టైటాన్స్తో తేలిపోయింది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ మెరుగైన ఆరంభం ఇవ్వాల్సి ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో రాణించిన ఈ జోడీ.. గుజరాత్ మ్యాచ్లో మాత్రం విఫలమైంది. మిడిలార్డర్లో దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్, లియామ్ లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా బరిలోకి దిగనున్నారు.
ఆ కుర్రాడిపై వేటు..
దేవదత్ పడిక్కల్ గత మూడు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. అతను తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. మిగతా మిడిలార్డర్ బ్యాటర్లంతా సూపర్ ఫామ్లో ఉన్నారు. కృనాల్ పాండ్యా బౌలింగ్లో రాణిస్తున్నా.. బ్యాట్తో మెరవాల్సింది. లివింగ్ స్టోన్, టీమ్ డేవిడ్ సూపర్ ఫామ్లో ఉండటం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. సుయాష్ వర్మ స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఆడనున్నాడు. గత మ్యాచ్లో సుయాష్కు బదులు బరిలోకి దిగిన రసిఖ్ దార్పై వేటు పడనుంది. ఈ ఒక్క మార్పు మినహా ఆర్సీబీ తుది జట్టులో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. గత మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు తేలిపోయారు. భువీ, జోష్ హజెల్ వుడ్ రాణించినా.. యశ్ దయాల్, రసిఖ్ దార్ తేలిపోయారు.
ఆర్సీబీ తుది జట్టు(అంచనా):
ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్, లియామ్ లివింగ్ స్టోన్, జితేష్ శర్మ(కీపర్), టీమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్
ఇంపాక్ట్ ప్లేయర్: సుయాష్ శర్మ