ఐపీఎల్ 2025 సీజన్ను ఘనంగా ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. శుక్రవారం(మార్చి 28) చెన్నై వేదికగా జరిగే తదుపరి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)తో ఆర్సీబీ అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్)పై పూర్తి ఆధిపత్యం చెలాయించి ఏక పక్ష విజయాన్నందుకున్న ఆర్సీబీ.. మంచి జోష్లో ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ను ఓడించి శుభారంభం చేసిన సీఎస్కే అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. దాంతో ఫ్రైడే ఫైట్ రసవత్తరంగా మారనుంది.
గత సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ సంచలన విజయంతో ప్లే ఆఫ్స్ చేరుకుంది. ఆ విజయానంతరం టైటిల్ గెలిచిన రీతిలో ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేసుకోగా.. చెన్నై ఫ్యాన్స్ తీవ్ర బాధకు గురయ్యారు. ఇరు జట్ల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడిచింది. అంబటి రాయుడి వంటి మాజీ క్రికెటర్లు కూడా తమ వ్యాఖ్యలతో ఫ్యాన్స్ను మరింత రెచ్చగొట్టారు.

భారత్Xపాక్ తరహా క్రేజ్..
ఈ క్రమంలోనే సీఎస్కే X ఆర్సీబీ పోరుకు భారత్-పాక్ తరహా క్రేజ్ ఏర్పడింది. ఆర్సీబీని ఓడించి గత సీజన్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని సీఎస్కే ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరోవైపు విజయంతో సీఎస్కే ట్రోల్స్కు సమాధానం ఇవ్వాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇరు జట్లు విజయమే లక్ష్యంగా ఈ మ్యాచ్ కోసం సిద్దమవుతున్నాయి. ఇప్పటికే చెన్నైలో అడుగుపెట్టిన ఆర్సీబీ.. నెట్స్లో ముమ్మరంగా సాధన చేస్తోంది.
భువనేశ్వర్ కుమార్ డౌట్..
గాయంతో బాధపడుతున్న ఆర్సీబీ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. చెన్నైతో ఆడటంపై కూడా సందేహాలు నెలకొన్నాయి. భువీ గాయంపై ఆర్సీబీ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. భువనేశ్వర్ చిన్న గాయంతో బాధపడుతున్నాడని కేకేఆర్తో మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ ట్వీట్ చేసింది. భువీ ఫిట్నెస్పై ఎలాంటి అప్డేట్ లేదు. అతని స్థానంలో యువ పేసర్ రసిక్ సలామ్ బరిలోకి దిగాడు. అతను ధారళంగా పరుగులిచ్చినా ఒక వికెట్ తీసాడు. భువనేశ్వర్ కుమార్ ఫిట్నెస్ సాధించి జట్టుకు అందుబాటులోకి వస్తే రసీక్ సలామ్పై వేటు పడనుంది. భువీ ఆడకపోతే మాత్రం రసీక్ సలామ్ జట్టులో కొనసాగనున్నాడు.
అతనిపై వేటు..
చెన్నై పిచ్ సాధారణంగా స్పిన్కు అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ తొలి మ్యాచ్ తరహాలోనే ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుంది. ఫస్ట్ మ్యాచ్లో కృనాల్ పాండ్యా సంచలన ప్రదర్శన కనబర్చగా.. సుయాశ్ శర్మ కాస్త పరుగులు ఎక్కువగా ఇచ్చాడు. స్పిన్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ పర్వాలేదనిపించాడు. ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే స్వప్నిల్ సింగ్ తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు రసిక్ సలామ్ బెంచ్కు పరిమితమవుతాడు. టీమ్ డేవిడ్ మూడో పేసర్గా సేవలందిస్తాడు. తొలుత బ్యాటింగ్ చేస్తే.. సుయాశ్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడు. సెకండ్ బ్యాటింగ్ చేస్తే దేవదత్ పడిక్కల్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడుతాడు. మిగతా లైనప్లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు.
ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉండగా.. దేవదత్ పడిక్కల్ కూడా పర్వాలేదనిపించాడు. కెప్టెన్ రజత్ పటీదార్ కూడా ఆకట్టుకున్నాడు. లియామ్ లివింగ్ స్టోన్ ఫినిషర్గా తన వంతు పాత్ర పోషించాడు. వికెట్ కీపర్గా జితేశ్ శర్మ కొనసాగనుండగా.. అతనితో పాటు టీమ్ డేవిడ్, కృనాల్ పాండ్యాలకు తొలి మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 8వ స్థానం వరకు ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ఉండటం కలిసొచ్చే అంశం.
సీఎస్కేతో.. ఆర్సీబీ తుది జట్టు(అంచనా):
విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్(ఇంపాక్ట్), రజత్ పటీదార్, లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, టీమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిక్ సలామ్/భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్.
ఇంపాక్ట్ ప్లేయర్: సుయాశ్ శర్మ