ఐపీఎల్ 2024 సీజన్లో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. జైపూర్ వేదికగా శనివారం జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో అమీతుమీ తేల్చుకోనుంది.
గత నాలుగు మ్యాచ్ల్లో ఒకే ఒక్కదాంట్లో గెలిచిన ఆర్సీబీ.. ఈ మ్యాచ్లో విజయం సాధించి గెలుపు బాట పట్టాలనుకుంటోంది. మరోవైపు వరుస విజయాలతో రాజస్థాన్ రాయల్స్ జోరు మీద ఉంది.

కోహ్లీ మినహా..
ఆర్సీబీ స్టార్ ఆటగాళ్లు చెలరేగితేనే ఆ జట్టు విజయాల బాట పట్టనుంది. విరాట్ కోహ్లీ మినహా మరే బ్యాటర్ కూడా రాణించడం లేదు. గ్లేన్ మ్యాక్స్వెల్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దారుణంగా విఫలమవుతున్నారు. బౌలింగ్లో సిరాజ్, రీస్ టోప్లీ అంతగా ప్రభావం చూపలేకపోతున్నారు. పేస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ జట్టుకు భారంగా తయారయ్యాడు.
ఆటగాళ్ల పేలవ ఫామ్కు తోడు చెత్త ఫీల్డింగ్ కూడా ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది. ఈ క్రమంలోనే టీమ్ కాంబినేషన్లో మార్పులు చేయాలని ఆర్సీబీ మేనేజ్మెంట్ భావిస్తోంది. అనూజ్ రావత్పై వేటు వేసి దినేశ్ కార్తీక్ను వికెట్ కీపర్గా కొనసాగించి మరో యువ ప్లేయర్ను జట్టులోకి తీసుకోవాలనుకుంటోంది.

కుర్రాడికి చోటు..
దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించిన సుయాష్ ప్రభుదేశాయ్కు తుది జట్టులో చోటు దక్కవచ్చు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న మహిపాల్ లోమ్రోర్తో అతనికి పోటీ నెలకొననుంది. పరిస్థితులకు తగ్గట్లు ఇంపాక్ట్ ప్లేయర్లుగా కర్ణ్ శర్మ, విజయ్ కుమార్ వైశాఖ్ల్లో ఒకరు బరిలోకి దిగనున్నారు.
మిగతా కాంబినేషన్లో ఎలాంటి మార్పులేదు. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ ఆడనుండగా.. ఫస్ట్ డౌన్లో రజత్ పటీదార్ బరిలోకి దిగనున్నాడు. నాలుగో స్థానంలో గ్లేన్ మ్యాక్స్వెల్, ఐదో స్థానంలో కామెరూన్ గ్రీన్ బ్యాటింగ్ చేస్తారు. ఫినిషర్లుగా అనూజ్ రావత్, దినేశ్ కార్తీక్ ఆడనుండగా.. రీస్ టోప్లీ, మయాంక్ దగార్, యశ్ దయాల్, మహమ్మద్ సిరాజ్లు బౌలర్లుగా కొనసాగనున్నారు.
ఆర్సీబీ తుది జట్టు(అంచనా):
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, రజత్ పటీదార్, గ్లేన్ మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, అనూజ్ రావత్, దినేశ్ కార్తీక్, మయాంక్ దగర్, రీస్ టోప్లీ, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్
ఇపాంక్ట్ ప్లేయర్స్: మహిపాల్ లోమ్రోర్, విజయ్కుమార్ వైశాఖ్, కర్ణ్ శర్మ