
హైదరాబాద్: ఐపీఎల్ 2021 లీగ్ దశను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయంతో ముగించింది. టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ ఆఖరి బంతికి సిక్స్కొట్టడంతో ఆర్సీబీ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్లో ఆఖరి బంతికి సిక్స్ బాది భరత్ విజయాన్ని అందించడంతో ఆర్సీబీ ఆటగాళ్ల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా ప్రతీ ఆటగాడు మైదానంలోకి వచ్చి ఎగిరి గంతేసాడు. ఇక డ్రెస్సింగ్ రూమ్లో సైతం ఇదే తరహా రచ్చ రచ్చ చేశారు. ప్రతీ ఒక్కరు కేఎస్ భరత్ను ప్రత్యేకంగా అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్సీబీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పంచుకుంది.
ఈ వీడియోలో కెప్టెన్ విరాట్ కోహ్లీ.. శ్రీకర్ భరత్ దగ్గరకు వచ్చి..'భరత్.. ఆ సిక్స్ మస్త్ కొట్టినవ్! నమ్మశక్యం కానీ షాట్ అది.'అని అనగా.. ఆ షాట్ కోసమే ఎదురు చూశానని కేఎస్ బదులిచ్చాడు. పుల్ బాల్ ఆడుదామనుకున్నావా? అని కోహ్లీ ప్రశ్నించగా.. మిడాఫ్ బౌండరీ మీదుగా సిక్స్ బాదాలనుకున్నానని కేఎస్ భరత్ చెప్పాడు. అయితే అవేశ్ ఖాన్ చేతి నుంచి బంతి జారిందని లేకుంటే ఆ బాలే సిక్స్గా వెళ్లేదని కోహ్లీ అన్నాడు. ఇక ఆ బంతి వైడ్ అవ్వగా.. తదుపరి బంతిని శ్రీకర్ లాంగాన్ దిశగా సిక్స్ బాది జట్టుకు విజయాన్నందించాడు. అయితే ఈ బంతి బాగా ఎత్తు వెళ్లి డిస్టెన్స్ క్లియర్ చేస్తుందో? లేదోనని సందేహించానని చెప్పగా.. కేఎస్ భరత్ ఆడిన తర్వాత క్లియర్ చేయదా? కోహ్లీ ప్రశంసించాడు.
ఇక తనపై నమ్మకంతో చివరి మూడు బంతులు ఆడేందుకు అనుమతించిన మ్యాక్స్వెల్ వల్లే ఇది సాధ్యమైందని భరత్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టుగా ప్రాక్టీస్ చేశామని, అదే తనను మ్యాచ్ ముగించేలా చేసిందన్నాడు. తాను 50 బంతులకు పైగా ఆడటంతో మ్యాచ్ ముగించాలని టీమ్ మేనేజ్మెంట్ సూచించిందని, ఆ ప్రణాళికలకు తగ్గట్లు ఆడానని భరత్ చెప్పుకొచ్చాడు. ఇక ఆర్సీబీ హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ సైతం కేఎస్ భరత్ను ప్రత్యేకంగా అభినందించాడు. హగ్ చేసుకొని మరి ప్రశంసించాడు. ఇక యుజ్వేంద్ర చాహల్ తన చిలిపి చేష్టలతో అలరించాడు. ప్రాక్టీస్లో తాను ఇచ్చిన సూచలనలతోనే భరత్ మ్యాచ్ గెలిపించాడని చెప్పాడు. ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్గా కూడా సేవలందిస్తున్నానని తెలిపాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 48), శిఖర్ ధావన్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 43) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(2/25) రెండు వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, డాన్ క్రిస్టియన్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 166 పరుగులు చేసింది. కేఎస్ భరత్ (52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 78 నాటౌట్), మ్యాడ్ మ్యాక్సీ(33 బంతుల్లో 8 ఫోర్లతో 51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ రెండు, అక్షర్ పటేల్ ఓ వికెట్ తీశాడు. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన భరత్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.