
న్యూఢిల్లీ: సక్సెస్ను ఏ మాత్రం తలకెక్కించుకోకుండా కష్టపడాలని తన సారథి విరాట్ కోహ్లీ సలహా ఇచ్చాడని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ తెలిపాడు. ఐపీఎల్ 2020 సీజన్లో సూపర్ పెర్ఫామెన్స్ కనబర్చి అందరి దృష్టిని ఆకర్షించిన పడిక్కల్.. తాజాగా మీడియాతో మాట్లాడాడు. తనకు ఇది ఆరంభం మాత్రమేనని, ఆటను ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాడు.
'కెరీర్ మరింత ముందుకు సాగాలంటే నా ఆటను మెరుగుపరుచుకోవాలి. ఇది ఆరంభం మాత్రమే. ఇన్నింగ్స్ను నిర్మించే విషయంలో విరాట్ ఎంతో సహాయం చేశాడు. సక్సెస్ను తలకు ఎక్కించుకోకుండా ఇదే విధంగా కష్టపడాలని చెప్పాడు. ముందుకు సాగుతూ.. మరింత మెరుగవ్వమన్నాడు. నేను అదే చేయాలనుకుంటున్నా. దేశం కోసం ఆడాలనే ఆలోచనలు చేయకుండా ఆటను ఆస్వాదిస్తూ ముందుకు సాగడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది జరగాల్సిన సమయంలో జరుగుతుంది.
సీనియర్ ఆటగాళ్ల నుంచి ఎంతో నేర్చుకున్నా. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోనే విషయంలో కూడా నా ఆలోచన దృక్పథం మారింది. సీనియర్ ఆటగాళ్లు జట్టు ఫలితాలతో సంబంధం లేకుండా స్థిరంగా ఉంటారు. ఫలితంపై కాకుండా ప్రక్రియపై దృష్టిపెడతారు. గెలిస్తే పొంగిపోరు.. ఓడితే కుంగిపోరు.'అని పడిక్కల్ చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కే పరిమితమైన ఆర్సీబీలో సానుకూలంశం ఏదైనా ఉందంటే అది పడిక్కల్ మాత్రమే. 15 మ్యాచ్లు ఆడిన ఈ యువ ఓపెనర్ 473 రన్స్ చేశాడు. అరంగేట్ర సీజన్లో అత్యధిక పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ రికార్డును అధిగమించడంతో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు.