
షార్జా: ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఓపెనర్లు దుమ్మురేపారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 53), దేవదత్ పడిక్కల్(50 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ ఇద్దరు తొలి వికెట్కు 111 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే ఐపీఎల్ చరిత్రలోనే చెన్నై సూపర్ కింగ్స్పై ఆర్సీబీ ఫస్ట్ వికెట్కు 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని అందుకోవడం ఇదే తొలిసారి. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఇరు జట్లు 27 సార్లు తలపడగా.. ఒక్కసారి కూడా ఆర్సీబీ ఓపెనర్లు 100 పరుగుల భాగస్వామ్యాన్ని అందించలేకపోయారు. ఆర్సీబీపై పూర్తి ఆధిపత్యం చెన్నైదే. చెన్నై 17 మ్యాచ్ల్లో విజయం సాధించగా.. ఆర్సీబీ 9 మ్యాచ్ల్లోనే గెలిచింది. ఒక్క మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది.
తాజా మ్యాచ్లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. కోహ్లీ, పడిక్కల్ శుభారంభాన్ని ఇతర బ్యాట్స్మన్ అందిపుచ్చుకోలేకపోయారు. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి రెండు బంతులను బౌండరీలకు తరలించిన కోహ్లీ మంచి జోరు మీద కనిపించాడు. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ సైతం అతనికి అండగా చెలరేగడంతో ఆర్సీబీ స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఇద్దరు పోటాపోటీగా బౌండరీలు బాదారు. ఈ జోడీ ఓవర్కు కనీసం ఒక బౌండరీ బాదడంతో పవర్ ప్లే ముగిసేసరికి ఆర్సీబీ.. వికెట్ నష్టపోకుండా 55 రన్స్ చేసింది. ఆ తర్వాత కూడా ఈ జోడీ జోరు కొనసాగింది. వీరి దూకుడుతో 11.1 ఓవర్లో 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంది. ముందుగా పడిక్కల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అనంతరం కోహ్లీ కూడా అర్థ శతకంతో ఫామ్ అందుకున్నాడు.
క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని డ్వేన్ బ్రావో విడదీశాడు. కోహ్లీ ఊరించే స్లో బంతిని వేసి బోల్తా కొట్టించాడు. బ్రావో బాల్కు టెంప్ట్ అయిన కోహ్లీ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద జడేజాకు చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబీడీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. శార్దూల్ బౌలింగ్లో ఏబీడీతో పాటు పడిక్కల్ వరుస బంతుల్లో ఔటయ్యారు. ఇది ఆర్సీబీ ఇన్నింగ్స్పై ప్రభావం చూపింది. చివర్లో బ్రావో మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సాధారణ స్కోర్కే పరిమితమైంది.