
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సమయాత్తం అవుతోంది. సన్నాహకాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు దుమ్మురేపారు. తమదైన బ్యాటింగ్తో భారీ షాట్లు ఆడుతూ బౌలర్లపై విరుచుకుపడ్డారు. జట్టులోని ఆటగాళ్లను ఫాఫ్ డుప్లెసిస్ ఎలెవన్, హర్షల్ పటేల్ ఎలెవన్ టీమ్స్గా విభజించి ఈ ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించింది. ఈ సన్నాహక మ్యాచ్లో ఫాఫ్ డుప్లెసిస్ టీమ్ 2 పరుగల తేడాతో గెలుపొందింది. దాంతో కెప్టెన్గా సీజన్ ప్రారంభానికి ముందే ఫాఫ్ తొలి విజయాన్నందుకున్నాడు.
ఈ సన్నాహక మ్యాచ్లో ముందుగా ప్రాక్టీస్ చేసిన ఫాఫ్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(40 బంతుల్లో 76), బిగ్ హిట్టర్ రూథర్ఫోర్డ్(59) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. యువ ప్లేయర్ అనూజ్ రావత్(46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. కర్ణ్ శర్మకు రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన హర్షల్ టీమ్.. నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు మాత్రమే చేసి రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ జట్టులో యువ ప్లేయర్ సుయేశ్(46 బంతుల్లో 87) హాఫ్ సెంచరీ బాదగా.. దినేశ్ కార్తీక్(21 బంతుల్లో 49), డేవిడ్ విల్లే(17 బంతుల్లో 25) రాణించారు. ఆకాశ్ దీప్కు 4 వికెట్లు దక్కాయి. ఈ ప్రాక్టీస్ మ్యాచ్కు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక కెప్టెన్గా సన్నాహక మ్యాచ్లోనే విజయాన్నందుకున్న ఫాఫ్... లీగ్లోనూ అదే జోరు కొనసాగించాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. ప్లే ఆఫ్స్ చేరడమే తమ ప్రథమ లక్ష్యమని కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఈ సందర్భంగా తెలిపాడు.
ఇక 'ఈ సాల కప్ నమదే' (ఈసారి కప్ మాదే).. అంటూ ప్రతి ఐపీఎల్ సీజన్ కు ముందు, లీగ్ సమయంలోనూ సందడి చేసే (ఆర్సీబీ) ఇప్పటి వరకు ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఆకర్షణీయ ఆటగాళ్లకు ఎప్పుడూ కొదవ లేకున్నా.. జట్టులో ఎందరో స్టార్లు. దమ్మున్న సారథీ ఉన్నా.. కానీ ఎందుకో.. ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ అందలేదు. అమ్ములపొదిలో అన్ని అస్త్రాలూ ఉన్నా.. ట్రోఫీపై తొలి ముద్దు కోసం ఆ జట్టు నిరీక్షణ కొనసాగుతూనే ఉంది.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, ఈ టీమ్ పెద్దన్న ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆర్సీబీ ఈ సారి కొంచెం కల తప్పినట్లుగా కనిపిస్తోంది. ఈ ఏడాది మెగావేలంలో జట్టులోకి వచ్చిన డుప్లెసిస్కు కెప్టెన్సీ ఇచ్చిన మేనేజ్ మెంట్.. ఈసారైనా టైటిల్ సాధించాలని ఆశిస్తోంది. ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్లో టైటిల్ వేటను ప్రారంభించనుంది.