న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) యువ ఆటగాళ్ల ప్రదర్శనపై ఆ జట్టు హెడ్ కోచ్ సంజయ్ బంగర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులో ఉన్న కుర్రాళ్లు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దాంతో గెలవాల్సిన మ్యాచ్ల్లో ఆర్సీబీ ఓటమిపాలవుతుందని చెప్పాడు. ముఖ్యంగా షెహ్బాజ్ అహ్మద్, అనూజ్ రావత్లు జట్టులో ఉండి కూడా దండుగని తెలిపాడు.
16 ఏళ్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ఆర్సీబీ గత మూడు సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరింది. కానీ ఈసారి ప్లే ఆఫ్స్ చేరడం కూడా ఆ జట్టుకు కష్టంగా మారింది. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడి ఐదింటింలో మాత్రమే గెలిచిన ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవాలి. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్తో వరుసగా ఓడిన ఆర్సీబీ.. ఈ రెండు మ్యాచ్లను చేజేతులా కోల్పోయింది. దాంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు 22 శాతానికి పడిపోయాయి.

ఆర్సీబీ పూర్తిగా విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డుప్లెసిస్లపైనే ఆధారపడుతోంది. ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు విఫలమైనా.. జట్టు ఓటమిపాలవుతోంది. ముఖ్యంగా యువ ఆటగాళ్ల వైఫల్యం ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది.
ఒకటి రెండు మ్యాచ్ల్లో మహిపాల్ లోమ్రోర్ అదరగొట్టినా.. షెహ్బాజ్ అహ్మద్, అనూజ్ రావత్ వంటి ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. దినేశ్ కార్తీక్, వానిందు హసరంగ, హర్షల్ పటేల్ కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయారు. ఈ క్రమంలోనే జట్టులోని యువ ఆటగాళ్ల ప్రదర్శనపై సంజయ్ బంగర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
'కుర్రాళ్లు ఆశించిన రీతిలో సక్సెస్ కావడం లేదు. మహిపాల్ లోమ్రోర్ ఒక్కడే ఇచ్చిన అవకాశాలను సరిగ్గా వాడుకున్నాడు. కానీ అనూజ్ రావత్, షెహ్బాజ్ అహ్మద్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా వృథా చేశారు. కనీసం జట్టులో ఉన్నామనే గుర్తింపును కూడా నిరూపించుకోలేకపోయారు.
ఇలాంటి జట్టుతో టైటిల్ గెలవడం కష్టం. అయితే కుర్రాళ్ల ప్రదర్శన విషయంలో ఓపిక అవసరం. అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తేనే వాళ్లు మ్యాచ్ విన్నర్లుగా తయారవుతారు. కోహ్లీ, మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ బాటలో నడిచేలా కుర్రాళ్లకు స్పెషల్ క్లాస్ తీసుకుంటాం.'అని సంజయ్ బంగర్ చెప్పుకొచ్చాడు.
ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్లతో తలపడనుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మూడు మ్యాచ్ల్లో ఆర్సీబీ తప్పకుండా గెలవాలి.