
బెంగళూరు: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అభిమానుల్లో కొత్త ఆందోళన మొదలైంది. ఇన్నాళ్లు జట్టును నడిపించిన విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలను వదులుకోగా.. టీమ్మేనేజ్మెంట్ సౌతాఫ్రికా లెజండరీ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ను తమ నూతన సారథిగా ఎంపిక చేసింది. గత శనివారమే బెంగళూరులో 'ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్'పేరిట పెద్ద కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీమ్ కెప్టెన్తో పాటు.. కొత్త జెర్సీని ఆవిష్కరించింది. విరాట్ కోహ్లీ వారసుడిగా టీమ్ కెప్టెన్సీ రేసులో డుప్లెసిస్తో పాటు దినేశ్ కార్తీక్, మ్యాక్స్వెల్ పేర్లు వినిపించినా.. అంతా ఊహించినట్లుగానే సౌతాఫ్రికా ప్లేయర్కు సారథ్య బాధ్యతలు దక్కాయి.
అంతర్జాతీయ కెప్టెన్సీ అనుభవంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్స్లోనూ కెప్టెన్గా చేయడంతో డుప్లెసిస్కు ఆర్సీబీ ఈ అవకాశం కల్పించింది. పైగా తమ స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీతో పాటు ఏబీ డివిలియర్స్లు డుప్లెసిస్ పేరునే సూచించడంతో అతన్నే తమ తదుపరి కెప్టెన్గా ఖరారు చేసింది. అయితే అతని కెప్టెన్సీ రికార్డ్లే అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో ఫాఫ్ కెప్టెన్గా పెద్దగా రాణించింది లేదు.
2011లో అంతర్జాతీయ టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన డుప్లెసిస్.. 2013లో సౌతాఫ్రికా టీ20 జట్టుకి కెప్టెన్గా మారాడు. సఫారీ టీమ్కు 40 టీ20ల్లో డుప్లెసిస్ సారథ్యం వహించగా.. ఇందులో 25 మ్యాచ్ల్లో మాత్రమే ఆ జట్టు గెలిచింది. మిగిలిన 15 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇందులో 2014, 2016 టీ20 వరల్డ్కప్ మ్యాచ్లు కూడా ఉన్నాయి. ప్రైవేట్ లీగ్స్లో కలిపి ఓవరాల్గా 79 టీ20ల్లో డుప్లెసిస్ కెప్టెన్సీ వహించగా.. ఇందులో కేవలం 43 మ్యాచ్ల్లో మాత్రమే అతను జట్టుకు విజయాలందించాడు. ఓవరాల్గా కెప్టెన్గా అతని విజయాల శాతం 55% మాత్రమే. ఇప్పుడు ఈ గణంకాలే ఆ జట్టు అభిమానుల్లో ఆందోళన నెలకొనేలా చేసింది.
11 ఏళ్ల పాటు బెంగళూరు జట్టును నడిపించిన కోహ్లీ.. కనీసం ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు. దాంతో.. డుప్లెసిస్ అయినా ఆ కలను తీరుస్తాడని భావించిన అభిమానులకు అతని రికార్డ్స్ కలవరపడేలా చేస్తున్నాయి. అయితే కెప్టెన్గా ఉన్న సమయంలో డుప్లెసిస్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ ఒక్క విషయమే అభిమానులను కాస్త ఊపిరి పీల్చుకునేలా చేస్తుండగా.. అతని కెప్టెన్సీ రికార్డ్స్ మాత్రం భయపెడుతున్నాయి. మార్చి 26న ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కానుండగా.. 27న పంజాబ్ కింగ్స్తో జరిగే ఫస్ట్ మ్యాచ్తో ఆర్సీబీ తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది.