రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయోత్సవ వేడుకలు విషాదంగా ముగిసాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరు చిన్నారులతో పాటు ఓ మహిళ కూడా ఉంది. అంతేకాకుండా మరో 50 మంది గాయపడ్డారు. దాంతో ఆర్సీబీ జట్టుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఆర్సీబీ విజేతగా నిలవకపోయినా బాగుండేదని సొంత అభిమానులే పోస్ట్లు పెట్టారు.
ఇప్పటికే ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఆర్సీబీ మేనేజ్మెంట్తో పాటు ఈవెంట్ ఆర్గనైజర్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంబంధిత వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం సైతం ఈ ఘటనకు బాధ్యులైన సంబంధిత అధికారులను విధుల నుంచి తొలగించింది. అయితే ఈ ఘటనకు విరాట్ కోహ్లీనే కారణమంటూ కొంతమంది నెటిజన్లు అతనిపై దుమ్మెత్తి పోస్తున్నారు.

11 మంది ప్రాణాలను కోహ్లీనే తీసాడని, ఏఐ క్రియేటెడ్ ఫొటోలను షేర్ చేస్తున్నారు. హైదరాబాద్లో పుష్ప సినిమా సందర్భంగా జరిగిన తొక్కిసలాట జరిగితే అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారని, ఇప్పుడు కోహ్లీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కోహ్లీని చూసేందుకే అభిమానులు స్టేడియానికి తరలి వచ్చారని, అతని వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపిస్తున్నారు. కోహ్లీ అరెస్ట్ అనే యాష్ ట్యాగ్ను కూడా ట్రెండ్ చేశారు. ఓ సామజిక కార్యకర్త అయితే విరాట్ కోహ్లీపై పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశాడు. అతని కఠిన చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నాడున.
అయితే ఈ ఆరోపణలను విరాట్ కోహ్లీ అభిమానులు తిప్పికొడుతున్నారు. అసలు ఈ తొక్కిసలాట ఘటనకు విరాట్ కోహ్లీకి ఏం సంబంధం? అని ప్రశ్నిస్తున్నారు. విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని కోహ్లీ కోరాడా? లేక తన సోషల్ మీడియా ఖాతాల్లో విజయోత్స వేడుకలకు హాజరవ్వాలని ఫ్యాన్స్కు పిలుపునిచ్చాడా? లేదా తనకు సన్మానం చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ను కోరాడా? అని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విరాట్ కోహ్లీ.. టైటిల్ గెలవడం నచ్చక, కడుపు మంటతో అతనిపై నిందలు మోపుతున్నారని, ఈ ఘటనకు కోహ్లీకి ఎలాంటి సంబంధం లేదని ఆర్సీబీ ఫ్యాన్స్ స్పష్టం చేస్తున్నారు. చనిపోయిందని తమ ఆర్సీబీ అభిమానులేనని, ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదని పోస్ట్లు పెడుతున్నారు. అనుమతివ్వమని చెప్పిన పోలీసులు.. ఎవరి ఒత్తిడితో అనుమతిచ్చారని, సరైన భద్రత ఎందుకు కల్పించలేదని ప్రశ్నిస్తున్నారు. కోహ్లీని అరెస్ట్ చేసే ముందు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను అరెస్ట్ చేయాలని పోస్ట్లు పెడుతున్నారు. ఇతర జట్ల ఆటగాళ్ల మాదిరే కోహ్లీ ఈ విజయోత్స వేడుకలు జరుపుకున్నాడని, తొక్కిసలాట ఘటన తెలిసాకా విచారం వ్యక్తం చేశాడని గుర్తు చేస్తున్నారు.