ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ప్లే ఆఫ్స్ చేరింది. 12 మ్యాచ్ల్లో 8 విజయాలు, ఒక మ్యాచ్ రద్దవ్వడంతో 17 పాయింట్స్తో టేబుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్తో జరిగే తదుపరి మ్యాచ్ల్లో విజయం సాధిస్తే.. పాయింట్స్ టేబుల్లో టాప్-2లో నిలవనుంది. అయితే ఆదివారం(మే18) గుజరాత్ టైటాన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అయ్యింది. ఇప్పుడు ఈ మే18 ఆ జట్టు అభిమానులను కలవరపెడుతుంది.
గతేడాది కూడా ఆర్సీబీ మే18నే చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించి ప్లే ఆఫ్స్ చేరింది. కోహ్లీ జెర్సీ నెంబర్ అయిన 18న ఆర్సీబీ క్వాలిఫై అయ్యిందని, టైటిల్ పక్కా అని ఫ్యాన్స్ కామెంట్ చేశారు. కానీ ఆ సీజన్లో ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సారి కూడా అలానే అవుతుందా? అని ఫ్యాన్స్ ఆందోళనపడుతున్నారు. ప్లే ఆఫ్స్ చేరిన సంతోషం కంటే.. గతేడాది ఫలితం రిపీట్ అవుతుందా? అనే భయం వెంటాడుతోందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఆర్సీబీ తమ తదుపరి రెండు మ్యాచ్ల్లో గెలవకపోతే.. ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రూల్ ప్రకారం టాప్-2లో నిలిచిన జట్లు క్వాలిఫయర్-1 ఆడుతాయి. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ ఆడుతాయి. ఎలిమినేటర్లో గెలిచిన జట్టు.. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుతో క్వాలిఫయర్-2 ఆడుతోంది. క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టు.. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు మధ్య ఫైనల్ జరుగుతుంది. ఈ క్రమంలోనే టాప్-2లో నిలిచేందుకు జట్లు ప్రాధాన్యత ఇస్తాయి. క్వాలిఫయర్-1లో ఓడినా.. క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది.
ఆర్సీబీ ప్రధాన బౌలర్లు అయిన జోష్ హజెల్ వుడ్, లుంగి ఎంగిడి అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు నష్టం చేయనుంది. లుంగి ఎంగిడి స్థానాన్ని జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజర్బానీతో ఆర్సీబీ భర్తీ చేసింది. బ్లెస్సింగ్ ముజర్బానీ ఇప్పటివరకు మొత్తం 70 టీ20 మ్యాచ్లు ఆడి 7.02 ఎకానమీతో 78 వికెట్లు పడగొట్టాడు.