రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ పేసర్ యశ్ దయాల్ చిక్కుల్లో పడ్డాడు. మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణల కేసులో అతను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను జైపూర్ పోక్సో కోర్టు బుధవారం తిరస్కరించింది.
క్రికెట్ కెరీర్లో ఉన్నత స్థాయి చేరేందుకు అండగా ఉంటానని చెప్పి, లైంగికంగా లోబరుచుకున్నాడని జైపూర్కు చెందిన 17 ఏళ్ల యువతి యశ్ దయాల్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. యశ్ దయాల్ నుంచి లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఆ అమ్మాయి వయసు 17 ఏళ్లే కావడంతో ఆర్సీబీ పేసర్పై పోక్సో కేసు నమోదైంది.
ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని యశ్ దయాల్ తరఫున న్యాయవాది పిటిషన్ వేయగా.. జైపూర్ పోక్సో కోర్టు తిరస్కరించింది. ఈ కేసు అత్యంత తీవ్రమైనదని, మైనర్కు సంబంధించిన విషయం కావడంతో ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. అతన్ని అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వడానికి కూడా న్యాయస్థానం నిరాకరించింది.

యశ్ దయాల్పై ఇప్పటికే ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో కూడా ఓ లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని, లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఉజ్వల సింగ్ అనే యువతి ఆన్లైన్ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు అతన్ని అరెస్ట్ చేయకుండా స్టే ఇచ్చింది. కానీ జైపూర్ కేసులో మాత్రం ఎలాంటి ఉపశమనం లభించలేదు.
ఐపీఎల్ 2025 సీజన్లో యష్ దయాళ్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. 15 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసాడు. ఆర్సీబీ విజేతగా నిలవడంలో అతని ప్రదర్శన కీలకంగా మారింది. పంజాబ్తో జరిగిన ఫైనల్లోనూ యష్ దయాళ్ ఒక వికెట్ తీసాడు. తాజా ఆరోపణలు, కేసు యష్ దయాళ్ కెరీర్పై ప్రభావం చూపనుంది. తాజా పోక్సో కేసులో యశ్ దయాల్ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే అతనిపై బీసీసీఐ నిషేధం విధించే అవకాశం ఉంది.