ఐపీఎల్ 2025 ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కీలక ప్రకటన చేసింది. మూడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత సోషల్ మీడియా వేదికగా తొలి పోస్ట్ను షేర్ చేసింది. ఐపీఎల్ 2025 విజయానంతరం బెంగళూరు వేదికగా జరిగిన విజయోత్సవ వేడుకల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనను గుర్తు చేసుకుంటూ విచారం వ్యక్తం చేసింది. ఈ దురదృష్ట ఘటన కారణంగానే ఈ మూడు నెలలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు చేయలేదని స్పష్టం చేసింది. ఇక నుంచి ఆర్సీబీ కేర్స్ ద్వారా అభిమానులకు అండగా ఉంటామని ఈ పోస్ట్ ద్వారా ప్రకటించింది.
ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం బయట చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరు మహిళలతో పాటు ఓ చిన్నారి కూడా ఉన్నాడు. ఈ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక ప్రభుత్వం.. ఆర్సీబీ టీమ్ మేనేజర్తో పాటు ఈవెంట్ ఆర్గనైజర్స్పై కేసు నమోదు చేసింది. కర్ణాటక అసోసియేషన్ ప్రతినిధులతో పాటు సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంది.

ఈ ఘటనలో మృతి చెందిన వారికి, గాయపడిన వారికి కర్ణాటక ప్రభుత్వంతో పాటు ఆర్సీబీ ఆర్థిక సాయం ప్రకటించింది. మరింత ఆర్థిక సాయం చేసేందుకు ఆర్సీబీ కేర్స్ ద్వారా ఫండ్ రైజింగ్ క్యాంపైన్ నిర్వహించింది. ఆ ఘటన తర్వాత సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టని ఆర్సీబీ.. ఇన్నాళ్లకు ఆర్సీబీ కేర్స్ గురించి చెబుతూ ఓ ప్రకటన చేసింది.
'ప్రియమైన 12వ మ్యాన్ ఆర్మీ(అభిమానులు)..ఇ ది మీకు మా హృదయపూర్వక లేఖ! ఇక్కడ మేము చివరిగా పోస్ట్ చేసి దాదాపు మూడు నెలలు అవుతోంది. మీకు దూరంగా ఉండాలని ఇలా చేయలేదు. దుఃఖంతోనే ఇలా చేశాం. ఈ వేదిక ఒకప్పుడు ఉత్సాహంగా, మధుర జ్ఞాపకాలతో, మీరు ఆస్వాదించిన క్షణాలతో కనిపించేది. కానీ జూన్ 4వ తేదీన చోటు చేసుకున్న ఘటన ఒక్కసారిగా అన్నింటినీ మార్చేసింది.
ఆ దురదృష్టకర ఘటన మా గుండెలను ముక్కలు చేసింది. ఆ బాధను భరించేందుకే మేం ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. ఈ సమయంలో మేం ఎంతో ఏడ్చాం. ఎన్నో విషయాలు విన్నా.. నేర్చుకున్నాం. ఈ ప్రక్రియలోనే ఆర్సీబీ కేర్ పురుడు పోసుకుంది. అభిమానులను గౌరవించాలని, అండగా నిలబడాలనే అవసరం నుంచి పుట్టింది. మా అభిమానుల కోసం నిర్వహించే కార్యక్రమాల కోసమే ఈ వేదికను ఏర్పాటు చేశాం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు సుదీర్ఘ విరామం తర్వాత ఈ వేదికపైకి వచ్చాం. మీతో ఈ విషయాన్ని పంచుకోవడానికి, అండగా నిలబడటానికి, కలిసి ముందుకు నడవడానికి, కర్ణాటకను గర్వంగా నిలబెట్టేందుకు ఆర్సీబీ కేర్స్ పనిచేస్తోంది.'అని ఆర్సీబీ ఆ పోస్ట్లో పేర్కొంది.