రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బౌలర్, టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్ వికెట్ సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్తో గురువారం జరిగిన మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ కెప్టెన్ అయిన భువనేశ్వర్ కుమార్ ఈ ఫీట్ సాధించాడు. జార్ఖండ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ ఈ ఘనతను అందుకున్నాడు.
భువీ హ్యాట్రిక్ ధాటికి జార్ఖండ్ బ్యాటర్లు రాబిన్ మింజ్(11), బాల్ కృష్ణ, వివేకానంద తీవారి(0) పెవిలియన్ చేరారు. 16వ ఓవర్ తొలి బంతికి రాబిన్ మింజ్ క్యాచ్ ఔటవ్వగా.. రెండో బంతికి బాల్ కృష్ణ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. మూడో బంతికి వివేకానంద తీవారీ(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

భువీ సంచలన బౌలింగ్తో ఈ మ్యాచ్లో యూపీ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. రింకూ సింగ్(28 బంతుల్లో 6 ఫోర్లతో 45), ప్రియమ్ గార్గ్(25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. జార్ఖండ్ బౌలర్లలో బాల్ కృష్ణ మూడు వికెట్లు తీయగా.. వివేకానంద తీవారీ రెండు వికెట్లు పడగొట్టాడు. అనుకుల్ రాయ్, వికాష్ సింగ్, వికాస్ కుమార్ తలో వికెట్ తీసారు.
అనంతరం జార్ఖండ్ 19.5 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. అనుకుల్ రాయ్(44 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 91) విధ్వంసకర బ్యాటింగ్ చెలరేగినా ఫలితం లేకపోయింది. భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్ ఆ జట్టు ఓటమిని శాసించింది. యూపీ బౌలర్లలో భువీ మూడు వికెట్లు తీయగా.. నితీష్ రాణా, మోహ్సిన్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. వినీత్ పన్వార్, విప్రాజ్ నిగమ్, శివమ్ మావి తలో వికెట్ తీసారు.
ఐపీఎల్ 2025 సీజన్ ముంగిట భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్ తీయడం ఆ జట్టు అభిమానులను సంతోషపరుస్తోంది. గత సీజన్ వరకు సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన భువనేశ్వర్ కుమార్ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ రూ. 10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. చిన్నస్వామి స్టేడియాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్సీబీ.. భువీని కొనుగోలు చేసింది. అతని అనుభవం.. స్లో బౌలింగ్ జట్టుకు ఉపయోగపడనుంది. భువీ, హజెల్ వుడ్తో ఆర్సీబీ పేస్ విభాగం భీకరంగా ఉంది.