ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజేతగా నిలిచింది. పంజాబ్ కింగ్స్తో మంగళవారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 18 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించింది. గత 18 ఏళ్లుగా ఊరించిన టైటిల్ను అసాధారణ ప్రదర్శనతో ముద్దాడింది. విరాట్ కోహ్లీ ఎట్టకేలకు తన తొలి ఐపీఎల్ టైటిల్ను అందుకున్నాడు. ఈ విజయంతో కోహ్లీ కన్నీటి పర్యంతమయ్యాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(35 బంతుల్లో 3 ఫోర్లతో 43) టాప్ స్కోరర్గా నిలవగా.. మయాంక్ అగర్వాల్(24), రజత్ పటీదార్(26), లివింగ్ స్టోన్(25), జితేష్ శర్మ(24) పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(3/40), కైల్ జెమీసన్(3/48) మూడేసి వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్ కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.
అనంతరం 20 ఓవర్లలో పంజాబ్ 7 వికెట్లకు 184 పరుగులే చేసి ఓటమిపాలైంది. శశాంక్ సింగ్(29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/38), కృనాల్ పాండ్యా(2/17) రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ తీసారు.

మలుపు తిప్పిన కృనాల్ పాండ్యా
191 పరుగుల లక్ష్యచేధనలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(24), ప్రభ్సిమ్రాన్ సింగ్(26) శుభారంభం అందించారు. తొలి వికెట్కు 43 పరుగుల జోడించారు. ఈ జోడీని హజెల్ వుడ్ విడదీసాడు. ప్రియాన్ష్ ఆర్య ఇచ్చిన క్యాచ్ను ఫిల్ సాల్ట్ బౌండరీ లైన్పై అద్భుతంగా అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన జోష్ ఇంగ్లీస్ దూకుడుగా ఆడాడు. దాంతో పవర్ ప్లేలో పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న ప్రభ్సిమ్రాన్ సింగ్ను కృనాల్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(1)ను రొమారియో షెపర్డ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి మ్యాచ్ను మలుపు తిప్పాడు.
వరుసగా వికెట్లు కోల్పోయిన పంజాబ్..
ఆ తర్వాత వచ్చిన నెహాల్ వధేరా జిడ్డుగా బ్యాటింగ్ చేయగా.. జోష్ ఇంగ్లీస్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అతన్ని కృనాల్ పాండ్యా ఔట్ చేయగా.. నెహాల్ వధేరా(15)ను భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినీస్ భారీ సిక్సర్ బాది మరుసటి బంతికి క్యాచ్ ఔటయ్యాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్(1)ను యశ్ దయాల్ ఔట్ చేయడంతో మ్యాచ్ ఆర్సీబీ వైపు మళ్లింది. చివర్లో శశాంక్ సింగ్ సిక్సర్, బౌండరీతో ఆశలు రెకెత్తించినా.. ఆఖరి ఓవర్ను హజెల్ వుడ్ కట్టుదిట్టంగా వేసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. చివరి ఓవర్లో శశాంక్ సింగ్ మూడు సిక్స్లు, ఓ బౌండరీ బాదినా పంజాబ్కు విజయం దక్కలేదు.