ఐపీఎల్ 2025 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సమాయత్తమవుతోంది. ఇప్పటికే తమకు అవసరం లేని ఆటగాళ్లను వేలంలోకి వదిలేసిన ఆర్సీబీ.. సపోర్ట్ స్టాఫ్ విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
తమ బౌలింగ్ కోచ్గా ముంబై రంజీ టీమ్ హెడ్ కోచ్ ఓంకార్ సాల్విని నియమించింది. అయితే అతను దేశవాళీ క్రికెట్ సీజన్ ముగిసిన తర్వాత ఆర్సీబీ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రస్తుతం అతను ముంబై రంజీ టీమ్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.

రంజీ ట్రోఫీ 2023-24కు ముందే ఓంకార్ సాల్వి ముంబై హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అతని పర్యవేక్షణలో అసాధారణ ప్రదర్శన కనబర్చిన ముంబై.. రంజీ ట్రోఫీ 2-23-24 విజేతగా నిలిచింది. 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది.
అంతేకాకుండా ప్రతిష్టాత్మక ఇరానీ కప్ను కూడా ముంబై గెలుచుకుంది. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముంబై ఇరానీ కప్ను ముద్దాడింది. ఈ రెండు విజయాలతో ఓంకార్ సాల్వి పేరు మారుమోగింది. ముంబై రంజీ టీమ్ హెడ్ కోచ్గా ఉన్న సాల్వి.. కాంట్రాక్ట్ వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది.
అయితే ఓంకార్ సాల్వీకి ఆటగాడిగా పెద్దగా అనుభవం లేదు. అతను 2005లో రైల్వేస్ తరఫున ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. అతను తన కెరీర్లో ఒకే ఒక వికెట్ తీసుకున్నాడు. కానీ మంచి కోచ్గా గుర్తింపు పొందాడు.
తాజా రంజీ సీజన్లోనూ అతని పర్యవేక్షణలోని ముంబై జట్టు ఎలైట్ గ్రూప్లో మూడో స్థానంలో ఉంది. 5 మ్యాచ్లు ఆడి 22 పాయింట్లు సాధించింది. సాల్వీకి ఐపీఎల్ ఆడిన అనుభవం లేదు. కానీ కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు అసిస్టెంట్ బౌలింగ్ కోచ్గా పనిచేశాడు.