విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) యాజమాన్యం ఆర్థిక సాయం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందజేస్తామని తెలిపింది. ఈ మేరకు తమ అధికారిక ఎక్స్ పేజీలో ఓ పోస్ట్ చేసింది. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులైన వారికి చికిత్స కోసం ఆర్సీబీ కేర్స్ పేరిట నిధులు సేకరించాలని నిర్ణయించింది.
'బెంగళూరులో బుధవారం చోటు చేసుకున్న దురదృష్టకర ఘటన ఆర్సీబీ కుటుంబానికి తీవ్ర బాధను కలిగించింది. ఈ ఘటనలో మృతి చెందిన ప్రతీ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ఆర్సీబీ ప్రకటించింది. గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం ఆర్సీబీ కేర్స్ పేరిట నిధులు సేకరించాలని నిర్ణయించింది.

మేం చేసే ప్రతీ పనికి మా అభిమానుల నుంచి మద్దతు లభిస్తుంది.'అని ఆర్సీబీ తమ పోస్ట్లో పేర్కొంది. ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున కర్ణాటక ప్రభుత్వం పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆర్సీబీ ప్రకటించిన నష్ట పరిహారం సరిపోదని, ఒక్కో కుటుంబానికి కోటీ రూపాయలు అందజేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. ఈ విజయంతో 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది. సుదీర్ఘ కాలం తర్వాత ఆర్సీబీ టైటిల్ గెలవడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి హద్దేలేకుండా పోయింది. ఆర్సీబీ విజయాన్ని దేశవ్యాప్తంగా అభిమానులు సెలెబ్రేట్ చేసుకున్నారు. బెంగళూరులో ఆర్సీబీ సంబరాలు అంబరాన్నంటాయి.
తమ అభిమాన జట్టును చూసేందుకు అభిమానులు లక్షలాదిగా తరలిరావడంతో బెంగళూరు ఎరుపెక్కింది. కానీ భద్రతా లోపం.. ఫ్రాంచైజీ నిర్లక్ష్యం కారణంగా చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఓ మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఆర్సీబీ ఓడినా బాగుండేదని ఆ జట్టు అభిమానులే పోస్ట్లు పెడుతున్నారు. పంజాబ్ కింగ్స్ విజేతగా నిలిచి ఉంటే ఆర్సీబీ అభిమానులు రెండు రోజులు బాధపడి మర్చిపోయేవారని, కానీ ఈ విజయం 11 మంది కుటంబ సభ్యులకు గుండె కోతను మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.