ఐపీఎల్ 2025 సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ గత శనివారం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం 10 జట్లు మొత్తం 74 మ్యాచ్లు ఆడనున్నాయి. అయితే ఇందులో కొన్ని జట్ల మధ్య రెండేసి మ్యాచ్లు ఉంటే.. మరికొన్ని జట్ల మధ్య మాత్రం ఒక్కో మ్యాచే ఉంది. ఇది అభిమానులను అయోమయానికి గురి చేస్తోంది. అసలు ఇలా షెడ్యూల్ రూపొందించడానికి గల కారణాన్ని తెలుసుకుందాం.
ఐపీఎల్ను బీసీసీఐ రౌండ్ రాబిన్ పద్దతిలో నిర్వహిస్తోంది. గతంలో 8 జట్లు తమ ప్రత్యర్థులతో రెండేసి మ్యాచ్లు ఆడేవి. ఇలా ప్రతీ జట్టు లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడేది. ఐపీఎల్ 2022 సీజన్లో కొత్తగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ జెయింట్స్ వచ్చి చేరడంతో టీమ్స్ సంఖ్య 10కి పెరిగింది. రౌండ్ రాబిన్ పద్దతి ప్రకారం 10 జట్లు తమ ప్రత్యర్థితో రెండు సార్లు ఆడితే... అప్పుడు ఒక్కో జట్టు 18 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఒక్కో మ్యాచ్ ఆడితే 9 మ్యాచ్లే అవుతాయి.

10 జట్లు రెండు గ్రూప్స్గా..?
18 మ్యాచ్లు నిర్వహిస్తే టోర్నీని మరింత పొడిగించాల్సి ఉంటుంది. ఆటగాళ్లపై పనిభారం పడుతోంది. 9 మ్యాచ్లు ఆడితే టోర్నీ మరింత చిన్నవుతోంది. ఈ క్రమంలోనే బీసీసీఐ 14 మ్యాచ్లనే నిర్వహిస్తోంది. ఇందుకోసం 10 జట్లను సీడింగ్ ర్యాంక్స్తో రెండు గ్రూప్లుగా విభజించింది. ఆయా జట్లు గెలిచిన టైటిళ్ల సంఖ్య, ఫైనల్, ప్లే ఆఫ్స్ చేరిన సంఖ్య ఆధారంగా 1-10 సీడింగ్ ర్యాంక్స్ కేటాయించింది. ఈ ర్యాంకులతో రెండు గ్రూప్స్గా విభజించింది.
సీఎస్కే, ముంబై ఇండియన్స్ ఐదు సార్లు టైటిల్ గెలవగా.. ముంబై కంటే సీఎస్కే ఎక్కువ ఫైనల్స్ ఆడింది. దాంతో జట్టు నెంబర్ వన్ సీడింగ్ ర్యాంక్తో గ్రూప్-1లో ఉంది. రెండో ర్యాంక్తో ముంబై ఇండియన్స్ గ్రూప్-2, మూడు టైటిళ్లు గెలిచిన మూడో ర్యాంక్తో కేకేఆర్ గ్రూప్-1లోకి రాగా.. ఒక్క టైటిల్తో పాటు మిగతా జట్ల కంటే ఫైనల్స్ ఆడిన సన్రైజర్స్ హైదరాబ్ గ్రూప్-2లోకి వెళ్లింది. ఇలా 10 జట్లను ర్యాంకుల ఆధారంగా రెండు గ్రూప్లుగా విభజించారు.
| గ్రూప్-1 | గ్రూప్-2 |
| సీఎస్కే | ముంబై ఇండియన్స్ |
| కేకేఆర్ | సన్రైజర్స్ హైదరాబాద్ |
| రాజస్థాన్ రాయల్స్ | గుజరాత్ టైటాన్స్ |
| ఆర్సీబీ | ఢిల్లీ క్యాపిటల్స్ |
| పంజాబ్ కింగ్స్ | లక్నో సూపర్ జెయింట్స్ |
14 మ్యాచ్లు ఎలా అంటే..?
ఒకే గ్రూప్స్లో ఉన్న జట్ల మధ్య రెండేసి మ్యాచ్లు జరగనున్నాయి. ప్రత్యర్థి గ్రూప్లో తమతో సరిసమానంగా ఉన్న టీమ్తో రెండు సార్లు మిగతా జట్లతో ఒక్కోసారి తలపడుతాయి. తమ గ్రూప్లోని ఇతర జట్లతో రెండేసి మ్యాచ్లు అంటే మొత్తం 8 మ్యాచ్లు.. ప్రత్యర్థి గ్రూప్లోని నాలుగు జట్లతో ఒకే ఒక్క మ్యాచ్ అంటే 4 మ్యాచ్లు.. సమానంగా ఉన్న టీమ్తో రెండు మ్యాచ్లు మొత్తం 14 మ్యాచ్లు ఆడనున్నాయి.
ఆర్సీబీ X ముంబై మధ్య ఒకే ఒక్క మ్యాచ్..
ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ వేర్వేరు గ్రూప్స్తో ఉండటంతోనే ఇరు జట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్, సీఎస్కే వేర్వేరు గ్రూప్స్లో ఉన్నా.. సేమ్ ర్యాంక్తో ఉండటంతో రెండేసి సార్లు తలపడనున్నాయి.