తరౌబా: ఐపీఎల్ కారణంగా ఈ తరం భారత ఆటగాళ్లకు అహంకారం పెరిగిందన్న దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ వ్యాఖ్యలకు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కౌంటరిచ్చాడు. తమలో ఎవరికీ అంత బలుపు లేదని స్పష్టం చేశాడు. భారత్ ఓటమిపాలైనప్పుడు ఇలాంటి విమర్శలు రావడం సహజమేనని జడేజా చెప్పుకొచ్చాడు. భారత ఆటగాళ్లలో ఎవరికీ వ్యక్తిగత ఎజెండా లేదని, అందరూ విజయం కోసమే కృషి చేస్తున్నారని జడేజా స్పష్టం చేశాడు.
మూడో వన్డే ప్రారంభానికి ముందు కపిల్ దేవ్ వ్యాఖ్యలను జడేజా ముందు ప్రస్తావించగా తనదైన శైలిలో చురకలంటించాడు. 'ప్రతీ ఒక్కరికి సొంత అభిప్రయాం ఉంటుంది. మాజీ ఆటగాళ్లకు వారి అభిప్రాయాన్ని పంచుకునే హక్కు కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ వారు చెబుతున్నట్లుగా భారత ఆటగాళ్లలో ఎవరీకి అహంకారం లేదు.

ప్రతీ ఒక్కరూ ఆటను ఆస్వాదిస్తున్నారు. అందరూ జట్టు విజయం కోసం 100 శాతం కష్టపడుతున్నారు. జట్టులో అంత సులువుగా చోటు దక్కుతుందని ఎవరూ భావించడం లేదు. జట్టు ఓడినప్పుడు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు వినబడుతుంటాయి.'అని జడేజా చెప్పుకొచ్చాడు.
ఆసియాకప్ బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్పై టీమ్మేనేజ్మెంట్ క్లారిటీ వచ్చిందని జడేజా వెల్లడించాడు. వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్లో చేసిన ప్రయోగాలతో టీమ్ బ్యాలెన్స్, బలం, బలహీనత వంటి అంశాలపై ఓ అవగాహన వచ్చిందన్నాడు.
ఇటీవలే సునీల్ గవాస్కర్ ఈ తరం భారత ఆటగాళ్లకు బలుపు ఎక్కువని విమర్శించాడు. సలహాలు, టిప్స్ కోసం ఒక్కరు కూడా మాజీ క్రికెటర్లను సంప్రదించడం లేదని, వారిని ఏంది కలిసేది? అనే అహంతో ఉంటున్నారని తెలిపాడు. కానీ సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు తాము ఆడే సమయంలో తరుచూ మాజీ క్రికెటర్ల సలహాలు, టిప్స్ తీసుకునేవారని గుర్తు చేసుకున్నాడు.
ప్రస్తుత టీమిండియా బ్యాటర్లలో టెక్నికల్ సమస్యలున్నా.. ఒక్కరు కూడా తనను కానీ ఇతర మాజీ క్రికెటర్లను కానీ సంప్రదించలేదన్నాడు. ఈ వ్యాఖ్యలనే ప్రస్తావిస్తూ కపిల్ దేవ్ కూడా భారత ఆటగాళ్లకు అహంకారం పెరిగిందని అభిప్రాయపడ్డాడు.