వెస్టిండీస్తో రెండో టెస్ట్లో టీమిండియా పట్టు బిగించింది. ముందుగా బ్యాటింగ్లో భారీ స్కోర్ చేసిన భారత్.. ఆ తర్వాత బౌలింగ్లో చెలరేగింది. రవీంద్ర జడేజా(3/98) తీన్మార్ బౌలింగ్తో రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 43 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. ఆ జట్టు ఇంకా 378 పరుగుల వెనుకంజలో ఉంది.
ఓపెనర్లు త్యాగనరైన్ చంద్రపాల్(67 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 34), జాన్ కాంప్బెల్(25 బంతుల్లో 2 ఫోర్లతో 10) మరోసారి నిరాశపర్చగా.. అలిక్ అథనాజే(84 బంతుల్లో 5 ఫోర్లతో 41), షైహోప్(46 బంతుల్లో 5 ఫోర్లతో 31 బ్యాటింగ్) పర్వాలేదనిపించారు. రోస్టన్ ఛేజ్(0) డకౌటవ్వగా.. టెవిన్ ఇమ్లాచ్(14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు.

అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 134.2 ఓవర్లలో 5 వికెట్లకు 518 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(258 బంతుల్లో 22 ఫోర్లతో 175), శుభ్మన్ గిల్(196 బంతుల్లో 2 సిక్స్లతో 16 ఫోర్లతో 129 నాటౌట్) శతకాలతో చెలరేగారు. నితీష్ కుమార్ రెడ్డి(54 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 43), ధ్రువ్ జురెల్(79 బంతుల్లో 5 ఫోర్లతో 44), కేఎల్ రాహుల్(54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 38) హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు.
వెస్టిండీస్ బౌలర్లలో జొమెల్ వారికన్(3/98) మూడు వికెట్లు తీయగా.. రోస్టన్ ఛేజ్ ఓ వికెట్ పడగొట్టాడు. మూడో రోజు ఆట మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది. వెస్టిండీస్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకొని బ్యాటింగ్ చేస్తే.. మ్యాచ్ రసవత్తరంగా మారుతుంది. అలా కాకుండా పెవిలియన్ క్యూ కడితే భారత్ ఏకపక్ష విజయాన్నందుకోనుంది. రెండో రోజు ఆటలోనూ మూడు సెషన్లలో టీమిండియా ఆధిపత్యం చెలాయించింది.
318/2 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే అనవసర పరుగుకు ప్రయత్నించి యశస్వి జైస్వాల్ రనౌట్గా వెనుదిరిగాడు. శుభ్మన్ గిల్తో సమన్వయ లోపం కారణంగా అతను డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డితో కలిసి గిల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో గిల్ 95 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో నితీష్ కుమార్ రెడ్డి దూకుడుగా ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగి హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. క్రీజులోకి ధ్రువ్ జురెల్ రాగా.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన గిల్ తొలి సెషన్ను ముగించాడు. దాంతో టీమిండియా 427/4 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
రెండో సెషన్లోనూ సాధికారికంగా బ్యాటింగ్ చేసిన గిల్.. 177 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ధ్రువ్ జురెల్ కూడా అతనికి అండగా నిలిచాడు. హాఫ్ సెంచరీ ముంగిట రోస్టన్ ఛేజ్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఐదో వికెట్కు నమోదైన 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే ఇండియా తమ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్.. భారత పేసర్లను ఆచితూచి ఆడింది. దాంతో జడేజాను బరిలోకి దింపిన గిల్ ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. ఓపెనర్ కాంప్బెల్ కొట్టిన షాట్ను షార్ట్ లెగ్ ఫీల్డర్ సాయి సుదర్శన్ అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్యాచ్ పట్టే క్రమంలో అతని చేతికి గాయమైంది. క్రీజులోకి వచ్చిన అథనజేతో కలిసి చంద్రపాల్ ఆచితూచి ఆడాడు. దాంతో 26/1 స్కోర్తో విండీస్ టీబ్రేక్కు వెళ్లింది.
ఆఖరి సెషన్లో విండీస్ ద్వయం సాధికారికంగా బ్యాటింగ్ చేసింది. ఓపికగా ఆడిన ఈ జోడీ వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. హాఫ్ సెంచరీ దిశగా సాగిన చంద్రపాల్ను జడేజా రాహుల్ సాయంతో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. షైహోప్తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించిన అలిక్ అథనజే(41)ను కుల్దీప్ యాదవ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే రోస్టన్ ఛేజ్(0)ను జడేజా డకౌట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన ఇమ్లాచ్తో కలిసి షైహోప్ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడి రెండో రోజు ఆటను ముగించాడు.